పరకాల, మే17: స్వీయ నియంత్రణతోనే కరోనాను కట్టడి చేయొచ్చని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో డీపీవో చంద్రమౌళి, డీఎల్పీవో కల్పన, వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అనంతరం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కరోనాపై ప్రజలు ఆందోళన చెందొద్దని, దీని నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ విషయమై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కరోనా సోకి, ఇంట్లో ఐసొలేషన్ అందుబాటులో లేని వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కల్పించిన వసతిని ప్రజలకు చెప్పాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్య ఉండొద్దని, నియోజకవర్గంలో అసంపూర్తి పనులను పూర్తి చేసేలా అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు.