న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణరాజుకు సికింద్రాబాద్లోని ఆర్మీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇవాళ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. దేశద్రోహం కేసులో అరెస్టు అయిన రామకృష్ణ రాజును తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆర్మీ హాస్పిటల్లోనే చికిత్స అందించాలంటూ సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు అపాయింట్ చేసిన జ్యుడిషియల్ ఆఫీసర్ సమక్షంలో ఎంపీ రఘుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కృష్ణరాజుకు నిర్వహించే మెడికల్ ఎగ్జామినేషన్ మొత్తాన్ని వీడియో తీయాలని, ఆ నివేదికను సీల్డు కవరులో తమకు పంపాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
గత శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ రఘు రామకృష్ణరాజును హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్చేసి ఏపీకి తరలించారు. ఆయనపై 124ఏ, 153ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసినట్టు ఏపీ సీఐడీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇరు వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై అభియోగం మోపారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, న్యూస్ చానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఎంపీ రఘుపై కేసు నమోదుచేశారు.