కరోనా సృష్టిస్తున్న కల్లోలంలో అనేక హృదయ విదారక ఉదంతాలను నిత్యం చూస్తునే ఉన్నాం. అందరికీ సహాయం చేయకలేకపోయినా కొంతమందికైనా చేయూతనిద్దామని కొందరు ముందుకొస్తున్నారు. వారి పరిధిలో చేతనైనా సహాయం చేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపుతున్నారు.
కరోనా సోకి ఇంట్లో వంట చేసుకోలేని వారికి నిత్యం మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని ఉచితంగా అందిస్తూ సేవాతత్పరతను చాటుకుంటున్నారు టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీశ్రెడ్డి. కౌశిక్, రాజు, షఫీ, సంతోష్, రోహిత్లతో జట్టుగా ఏర్పడిన ఆయన ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దాదాపు 100 మంది కరోనా రోగుల కడుపు నింపుతున్నారు. నాగోల్, ఎల్బీనగర్, కొత్తపేట, ఉప్పల్, రామంతాపూర్,హబ్సిగూడ, మౌలాలి, బోడుప్పల్, మన్సూరాబాద్ తదితర సమీప ప్రాంతాల్లో కరోనా తగ్గే వరకు ఐసొలేషన్లో ఉన్న వారికి ఉచితంగా భోజనం అందిస్తానని సతీశ్రెడ్డి తెలిపారు. ఉచిత భోజనం కావాల్సిన వారు 9641466666, 7331138990, 7893812990 నంబర్లను సంప్రదించాలన్నారు.
కరోనా బారిన పడి హోం ఐసొలేషన్లో ఉన్న వారికి ఆదివారం నుంచి ఉచిత భోజనం అందిస్తున్నట్లు శాసనమండలి సభ్యుడు బొగ్గారపు దయానంద్ గుప్త తెలిపారు. శనివారం కొత్తపేటలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి బాధితులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం ఉచితంగా అందిస్తామని, ప్రతిరోజు సాయంత్రం వరకు స మాచారమిచ్చిన వారికి మరుసటి రోజు భోజనం ఇస్తామని చె ప్పారు. ప్రధానంగా కొత్తపేట, మారుతీనగర్కు మూడు కిలోమీటర్ల పరిధిలోని వారికి ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. సాయం కావాల్సిన వారు 9542765766 ను సంప్రదించాలన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో అలమటిస్తున్న వారికి అన్నం పెడుతూ ఆకలి తీర్చతున్నది వాసవీ కేంద్రం. కరోనా కాలంలో సేవ చేయడమే ముఖ్యమని భావించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, కాసనగొట్టు రాజశేఖర గుప్త, కొండ్లె మల్లికార్జున్, అనురాగ్, అల్లంపల్లి రవికుమార్, పోల్పూరు రమేష్, జ్ఞానచందర్లు బృందంగా ఏర్పడి కొవిడ్ వ్యాధిగ్రస్తులతోపాటు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న పోలీసులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు. శుభ్రమైన వాతావరణంలో చక్కటి పౌష్టికాహారాన్ని అందిస్తూ వారు త్వరగా కోలుకునేలా చూస్తున్నారు.