చిట్యాల/ టేకుమట్ల/ ములుగు టౌన్/ వెంకటాపూర్/ ఏటూరునాగారం, మే 11 : ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అకాల వర్షం ఆగమాగం చేసింది. మంగళవారం కురిసిన వర్షంతో ధాన్యం, మిరుప కల్లాలు తడిశాయి. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. పలు గ్రామాల్లో విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. చిట్యాల మండలం నైన్పాక ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పలువురు రైతుల ధాన్యం తడిసి ముద్దయింది. వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో బొచ్చు రవి ఇంటి ముందు ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి పొగలు వచ్చాయి.