స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వ్యాపార సంస్థలు
డివిజన్లలో ఏకగ్రీవ తీర్మానాలు
వరంగల్, మే 10 : కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతున్న వేళ నగరం సెల్ఫ్ లాక్డౌన్ వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లా హోల్సేల్ వ్యాపారాలకు అడ్డా అయిన వరంగల్లో అనేక వ్యాపార సంస్థలు సెల్ఫ్ లాక్ డౌన్లు ప్రకటించాయి. అలాగే, కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో డివిజన్లలో కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్లకు తీర్మానాలు చేస్తున్నారు. స్థానికంగా డివిజన్లలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై వ్యాపారులతో సమావేశాలు నిర్వహించి, బంద్కు ఒప్పిస్తున్నారు. మూడు రోజులుగా వరంగల్లోని పలు ప్రాంతాల్లో సెల్ఫ్ లాక్డౌన్లు అమలవుతున్నాయి. నిత్యం పర్యాటకులతో ఉండే ఖిలావరంగల్ ప్రాంతంలోని 37, 38 డివిజన్లలో సెల్ఫ్ లాక్డౌన్ అమలులో ఉంది. ఉదయం నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం షాపులు తెరుస్తున్నారు. మధ్యాహ్నం నుంచి పూర్తిగా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. కరీమాబాద్, ఉర్సు, రంగశాయిపేట ప్రాంతాల్లో మంగళవారం నుంచి స్వచ్ఛంద బంద్కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ, సెల్ఫ్ లాక్డౌన్ నిర్ణయాలతో చాలా ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
స్వచ్ఛందంగా బంద్
కరోనా విజృంభిస్తుండడంతో వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇప్పటికే కాశీబుగ్గ, దేశాయిపేట వర్తక సంఘా లు లాక్డౌన్లు ప్రకటించాయి. పది రోజులు వ్యాపారాలు మూసివేయాలని నిర్ణయించాయి. అలాగే, రెండు రోజులుగా విశ్వకర్మ వీధిలో లాక్డౌన్ అమలులో ఉంది. అంతేకాకుండా బుధవారం నుంచి ఈ నెల 23 వరకు వరంగల్లో బట్టల దుకాణాలు బంద్ చేయాలని బట్టల వర్తక సంఘం ప్రకటించింది. అలాగే, ఈ నెల 14 నుంచి 23 వరకు బంగారం దుకాణాలు మూసివేయాలని దివరంగల్ బులియన్, జ్యూవెల్లరీ, డైమండ్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రకటించింది. అలాగే, మధ్యాహ్నం నుంచి దుకాణాలను మూసివేయాలని వరంగల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మర్చంట్స్ అసోసియేషన్ నిర్ణయించింది. కరోనా విస్తరిస్తున్న తరుణంలో సెల్ఫ్ లాక్డౌన్ల పరంపర కొనసాగుతోంది.