సిద్దిపేట కలెక్టరేట్, మే 5: కరోనావేళ రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. పంటను అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేసేలా ముందస్తుగా రూ.26 వేల కోట్లను సిద్ధంగా ఉంచారని చెప్పారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ నుంచి అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో మంత్రి హరీశ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులెవరూ ఇబ్బంది పడొద్దనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పల్లె పల్లెనా ప్రభుత్వమే మద్దతు ధరను కల్పిస్తూ ధాన్యం సేకరిస్తున్నదని స్పష్టంచేశారు.
వచ్చే 15 రోజుల్లో కొనుగోలు కేంద్రాలకు పెద్దమొత్తంలో ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని.. ఈ క్రమంలో కేంద్రాల బాధ్యులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో క్షేత్రస్థాయి నుంచి అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. రైతుల పంటను కాంటా వేసిన వెంటనే ట్యాబ్లో ఎంట్రీని పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే అధికారులు ట్యాబ్ ఎంట్రీ వెంటనే చేయలేకపోవడంతో రైతులకు నిర్దేశిత సమయంలో డబ్బులు వారి ఖాతాల్లో జమ కావడం లేదని.. దీనిని నివారించాలని సూచించారు.