హైదరాబాద్,మే 5:కరోనా ప్రభావం దేశంలోని అన్ని సంస్థల పైన తీవ్రంగా పడింది. ఇందులో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు. ఫార్మసీ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.2.88 కోట్ల ఆదాయాన్ని, రూ.21.69 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2019-20 ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.11.65 కోట్లు, నికర నష్టం రూ.25.74 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి సువెన్ లైఫ్సైన్సెస్ రూ.21.23 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. దీనిపై రూ.72.45 కోట్ల నికర నష్టం ఉంది.
ఇందులో సువెన్ లైఫ్సైన్సెస్తో పాటు దాని అనుబంధ సంస్థ అయిన సువెన్ న్యూరోసైన్సెస్ ఇంక్., ఆర్థిక ఫలితాలూ కలిసి ఉన్నాయి. నార్కోలెప్సీ ని అదుపు చేసే ఔషధమైన సమిలిశాంట్ (ఎస్యూవీఎన్-జీ3031) పై రెండో దశ క్లినికల్ పరీక్షల ఫలితాలను అమెరికాలో డీఎస్ఎంబీ (డేటా సేఫ్టీ మోనిటరింగ్ బోర్డు) కి అందించినట్లు సువెన్ లైఫ్ పేర్కొంది. అదనంగా మరికొంత మంది రోగులపై ఈ ఔషధానికి సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు వచ్చే ఏడాది చివరికి పూర్తవుతాయని వివరించింది.