అప్పటి దాకా ఎండ దంచికొట్టగా.. అంతలోనే ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. సోమవారం బంజారాహిల్స్లో జోరున కురుస్తున్న వర్షాన్ని పై చిత్రంలో చూడొచ్చు..
నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం ఎండ దంచికొట్టగా.. సాయంత్రం నాలుగు గంటలకు ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ఏకధాటిగా అరగంటకు పైగా కురిసింది. అత్యధికంగా రామచంద్రాపురంలో 3.5 సెంటీమీటర్లు, పటాన్చెరులో 2.3, శేరిలింగంపల్లిలో రెండు సెంటీమీటర్ల వర్షం పడింది. కుత్బుల్లాపూర్, చందానగర్, కూకట్పల్లి, యూసుఫ్గూడ, ఖైరతాబాద్, బేగంపేట, ఎర్రగడ్డ, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, కార్వాన్, మలక్పేట, ఫలక్నుమా, బషీర్బాగ్, చంపాపేట, సరూర్నగర్, అల్వాల్, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
దీంతో ఇన్ని రోజులు ఎండతీవ్రత, ఉక్కపోతతో అల్లాడిన నగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు వర్షం కురిసిన సమయంలో జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశాయి. ఇదిలా ఉంటే దక్షిణ మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తర ఇంటీరియల్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నదని.. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో నగరంలో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
మాదాపూర్, మే 3: మాదాపూర్ ఎస్బీఐ కాలనీలో ఏర్పాటు చేసిన ఓ గోదాంపై పిడుగు పడింది. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలు ఆర్పారు. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు వివరించారు.
మెహిదీపట్నం మే 3: నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురువగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. లంగర్హౌస్ సమీపంలోని తపోవనం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్డు ఎగిరిపోయింది. విద్యుత్ స్తంభం విరిగి అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆటోపై పడటంతో ధ్వంసమయ్యింది. అసిఫ్నగర్ డివిజన్ న్యూకిషన్ నగర్లోనూ విద్యుత్ ఓ ట్రాలీ ఆటోపై పడటంతో ముక్కలైంది. మెహిదీపట్నం, మల్లేపల్లి, రెడ్హిల్స్ ప్రాంతాల్లోనూ చెట్టు విరిగిపడగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.