హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ కథ ముగిసినట్టేనని స్పష్టమవుతున్నది. ఎన్నిక ఏదైనా ఆ పార్టీ ఓటమి ఖాయంగా మారింది. తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ రాత మారలేదు. పార్టీ సీనియర్ నేత, పెద్దమనిషిగా పేరున్న కే జానారెడ్డి కూడా కాంగ్రెస్ను గట్టెక్కించలేకపోయారు. యువకుడైన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భరత్కు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక తెల్లబోయారు. సాగర్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ ఎన్నికలో గెలిచి పూర్వ వైభవానికి బాట వేయాలని భావించింది. కొత్త అభ్యర్థిని నిలిపితే ఓటమి తప్పదని భావించిన అధిష్ఠానం.. స్థానికంగా మంచి పట్టున్న జానారెడ్డిని బరిలో నిలిపింది. ఈ ఎన్నిక కోసమే పీసీసీ అధ్యక్షుడి ఎంపికనూ వాయిదావేసింది. జానాతోపాటు సీనియర్ నేతలందరూ ప్రచారం చేశారు. చివరికి జానా సొంత మండలంలోనూ ప్రభావం చూపలేకపోయారు. 30 ఏండ్లపాటు చక్రం తిప్పిన చోటే ఓటమితో రాష్ట్రంలో ఆ పార్టీ కథ ముగిసినట్టేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. సోమవారం వెలువడే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్తున్నారు.
జానారెడ్డి చరిత్ర సమాప్తం!
కాంగ్రెస్ పార్టీకే పెద్ద దిక్కుగా చెప్పుకొనే సీనియర్ నేత కుందూరు జానారెడ్డికి టీఆర్ఎస్ చేతిలో వరుసగా రెండో ఓటమి తప్పలేదు. తన రాజకీయ జీవితంలోనే ఇంత తేడాతో పరాజయం కావడం కూడా ఇదే తొలిసారి. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఎనిమిదో సారి గెలిచి చరిత్ర సృష్టిస్తానని చేసిన విజ్ఞప్తిని సాగర్ ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఒక్కసారే అని స్వయం గా అన్న జానారెడ్డి మరోసారి పోటి చేస్తా రా.. లేదంటే ఇంతటితో ఊరుకుంటారా అనే దానిపై చర్చ మొదలైంది. ఒకరకంగా ఈ ఎన్నికల్లో సాగర్ ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో జానారెడ్డి రాజకీయ చరిత్ర ఇంతటితో పరిసమాప్తం అయినట్లేనని పరిశీకులు వ్యాఖ్యానిస్తున్నారు.