ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
ఊట్కూర్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో రంజాన్ పర్వదినం సందర్భంగా మండల వ్యాప్తంగా వివిధ మసీదులకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.10వేలు చెక్కులను ఆయా మసీద్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా నిర్వహించుకునేలా చూస్తున్నారని అన్నారు. ముస్లింలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు విద్యావకాశాలు కల్పించాలనే సంకల్పంతో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రవేశపెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్కుమార్గౌడ్, తాసిల్దార్ తిరుపతయ్య, ఉప సర్పంచ్ ఇబాదుర్ రహిమాన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందజేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడ కూడా అమలు కానీ సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మండలంలోని వల్లంపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులు చెక్కులను అందజేశారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.