సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పెళ్లిసందడి’. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఈ చిత్రంలోని తొలిపాటను ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలో రికార్డులను సృష్టించిన ‘అడవిరాముడు’, ‘బాహుబలి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చిన రోజున ఈ సినిమాలోని తొలి గీతాన్ని విడుదల చేయబోతున్నాం. శ్రీకాంత్ ‘పెళ్లిసందడి’కి ఇది సీక్వెల్ కాదు. కొత్త కథ, కథనాలతో రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. రాఘవేంద్రరావు, కీరవాణి కలయికలో వచ్చిన సినిమాల్లోని పాటలన్నీ విజయవంతమయ్యాయి. ఆ కోవలోనే ఈ సినిమాలోని పాటలు నిలుస్తాయి. సినిమా చిత్రీకరణ పూర్తయింది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్.