సెర్ప్ ఆధ్వర్యంలో మామిడి పండ్ల సేకరణ
మద్దూరులో ప్రారంభమైన కొనుగోళ్లు
హుస్నాబాద్లో ప్రారంభమైన మామిడి పండ్ల మార్కెట్
ఉత్తరాదికి నిత్యం 30 టన్నుల వరకు ఎగుమతి
రైతులకు కలిసి వస్తున్న ధర, సమయం
దళారుల దోపిడి నుంచి విముక్తి
మద్దూరు, ఏప్రిల్ 25 : దళారుల బెడద, స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం, ప్రకృతి వైపరీత్యాలతో ఏటా నష్టపోతున్న మామిడి రైతులను ఈసారి ప్రభుత్వం ఆదుకుంటున్నది. సిద్దిపేట జిల్లాలో మద్దూరు, హుస్నాబాద్ వంటి ప్రాంతాల్లో సెర్ప్, మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో మామిడి కాయలు, పండ్లను సేకరిస్తున్నది. తద్వారా స్థానిక రైతులు కరీంనగర్, వరంగల్తో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించుకునే ఇబ్బంది తప్పంది. అంతేకాకుండా అక్కడ పడిగాపులు కాయడం, రవాణా ఖర్చులు, దళారుల దోపిడీ బాధలు తప్పాయి. మంచి ధర పలుకుతుండడంతో రైతులు స్థానికంగా అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ర్టాలతో పాటు విదేశాలకు వ్యాపారులు పండ్లను ఎగుమతి చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. నిన్న మొన్నటి వరకు ధాన్యం, మొక్కజొన్న, కందులు, వేరుశనగ, పత్తి తదితర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం ప్రకృతి ప్రకోపంతోపాటు దళారుల చేతిలో కుదేలవుతున్న మా మిడి రైతును ఆదుకునేందుకు ముందుకొచ్చింది. మామిడి రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర, మార్కెటింగ్ వసతులను కల్పించి బెనిషాన్ కంపెనీ ద్వారా మామిడి కాయలు సేకరణకు ప్రభుత్వం, సెర్ప్ మార్గదర్శనంలో మం డల మహిళా సమాఖ్య, ఉమెన్ ఫా ర్మర్ ప్రొడ్యూసర్ కంపెనీల ఆధ్వర్యంలో మామిడి కాయలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో సంతోష ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఉమ్మడి మద్దూరు మండలంతో పాటు నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో మామిడి కాయలు సేకరిస్తున్నారు.
మామిడి రైతులకు మేలు..
మామిడి కాయలను కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో మామిడి రైతులకు లాభం చేకూరనున్నది. బెన్షాన్ కంపెనీ ఆ రోజు ఉన్న మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరను నిర్ణయించి రైతుల నుంచి మామిడి కాయలను సేకరిస్తున్నది. రైతులు ఏ ఒక్క వ్యక్తికి కమీషన్ ఇచ్చే ఇచ్చే పరిస్థితి ఉండదు. తరుగు సమస్యతో పాటు నిల్వ చేసే సమస్య ఉత్పన్నం కాదు. ప్రధానంగా రవాణా ఖర్చులు ఉండకపోవడంతో రైతులకు కలిసి వస్తున్నది. సమయం వృథా కాకుండా ఉం టుంది. దళారుల బెడద తప్పుతున్నది. రైతులు గ్రేడింగ్ చేసి మామిడి కాయలను అమ్ముకోవడంతో అధిక ధరలను పొందే వీలుంటుంది.
మద్దూరులో ప్రారంభమైన మామిడి కాయల కొనుగోళ్లు..
ఈ ఏడాది సిద్దిపేట జిల్లాలో మద్దూరు మండలంలో మామిడి కాయల కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో త్వరలోనే కొనుగోలు కేంద్రాను ప్రారంభించే అవకాశం ఉంది. గతేడాది 595 క్వింటాళ్ల మామిడి కాయలను కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 400 టన్నుల వరకు సేకరణకు లక్ష్యాలను నిర్దేశించింది. ఇప్పటికే మూడు మండలాలకు చెందిన మామిడి రైతుల వివరాలను సేకరించింది. వాటి ఆధారంగా నేరుగా రైతుల వద్దకు వెళ్లి సంతోష ఉమెన్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ కొనుగోళ్లను చేపడుతున్నది. మామిడి కాయల కొనుగోలు కేంద్రాలకు మా మిడి రైతుల నుంచి విశేష స్పందన వస్తున్నది.
దళారులకు విక్రయించొద్దు
రైతులు పండించిన మామిడి కాయలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తున్నది. రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దు. మామి డి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సెర్ప్-బెన్షాన్ కం పెనీ సంయుక్తంగా మామిడి కాయల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. రైతులు ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.
-వాస్దేవ్, డీపీఎం డీఆర్డీఏ సిద్దిపేట