పోరాడితే పోయేదేముంది… మరో సీటు, ఇంకో ఓటు తప్ప అన్నట్టుంది మున్సిపోల్స్లో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి. ‘చెల్లని రూపాయికి గీతలెక్కువ.. చేతకాని వానికి మాటలెక్కువ’ అన్నట్టు ఈ పార్టీలు ఎన్నికల బరిలో పోటీని ఇవ్వలేక… ఊరుపేరు లేని సోషల్ మీడియా పేరుతో ‘లేస్తే మనిషిని కాదు’ అని ఉరుకులాడుతున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) పార్టీలో చేరేవారు లేరు. టికెట్టు అడిగేవారు లేరు. ఓటు వేసేవారు లేరు. ప్రచారం చేసేవారు లేరు. పర్యవేక్షించే ముఖ్య నాయకులు లేరు. ఇదీ కాంగ్రెస్ బీజేపీల పరిస్థితి. ఈ మాత్రం దానికి ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డట్టు అని అడిగితే.. ‘ఎన్నికల్లో కొందరు గెలిచేటందుకు పోటీచేస్తారు. మరికొందరు మేమూ పోటీ చేసామనిపించుకొనేందుకు పోటీచేస్తారు. మున్సిపోల్స్లో మా పరిస్థితీ అలాగే ఉన్నది’ అన్నారు వరంగల్కు చెందిన ఒక బీజేపీ నాయకుడు. కాంగ్రెస్ అయితే పోలింగ్కు ముందే కాడి పారేసినట్టు కనిపిస్తున్నది. ఒకవైపు టీఆర్ఎస్ టికెట్లకు విపరీతమైన పోటీ ఏర్పడగా, కాంగ్రెస్, బీజేపీ టికెట్ల గురించి పట్టించుకున్న వారే లేరు. టీఆర్ఎస్ టికెట్ కోసం చివరిదాకా పోటీ పడిన వారు కూడా, టికెట్ దక్కకున్నా టీఆర్ఎస్లోనే ఉన్నారు తప్ప, కాంగ్రెస్, బీజేపీ టికెట్ల కోసం పోలేదు. టికెట్ దక్కనివారు వేరే పార్టీ టికెట్ నుంచి పోటీ చేయడం అనేది స్థానిక ఎన్నికల్లో అత్యంత సహజంగా కనిపించే పరిణామం.
ఈసారి అదీ లేదు. టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లకపోవడం సంగతి అటుంచితే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు సైతం, బీ ఫాంలు తీసుకొని రిటర్నింగ్ అధికారికి సమర్పించిన తర్వాత, టీఆర్ఎస్లో చేరి, బీ ఫాంతోపాటు, నామినేషన్ను కూడా ఉపసంహరించుకోవడం. ఉదాహరణకు జడ్చర్లలో ముగ్గురు బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగి, ప్రజల్లో టీఆర్ఎస్వైపే మొగ్గున్నదని తెలుసుకొని, ఏకంగా నామినేషన్ను ఉపసంహరించుకొన్నారు. ఇక మరో వార్డులో బీజేపీ నాయకుడి భార్య ఏకంగా టీఆర్ఎస్ టికెట్పై రంగంలోకి దిగారు. కేసీఆర్పై, గులాబీ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని గుర్తించి ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు నామినేషన్ను ఉపసంహరించుకొని టీఆర్ఎస్లో చేరారు. అదే డివిజన్లో బీజేపీ అభ్యర్థి, ఇండిపెండెంట్లు తాము కూడా బరిలోంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించడంతో ఏకంగా ఎన్నికే ఏకగ్రీవమైంది.
పేరుకే పోటీ
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో.. ఎలాగైనా ఫరవాలేదు.. కనీసం అన్ని స్థానాల్లో పోటీచేశామని చెప్పుకొనేందుకే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం 66 డివిజన్లలోనూ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కానీ బీజేపీ పరిస్థితి చూస్తే.. సుమారు 55 డివిజన్లలో నామమాత్రపు వ్యక్తులు, ప్రజలతో సంబంధం లేని వారితో నామినేషన్లు వేయించాల్సి వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున నిలబడ్డ అభ్యర్థులుకూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారంటే.. ఆ పార్టీ బలం ఏమిటో.. బలగం ఏమిటో అర్థమవుతుంది. వరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా నిలబెట్టిన వారిలో ఇద్దరు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరిపోయారు. గమ్మత్తేమిటంటే.. పలు పట్టణాల్లో టీఆర్ఎస్ టికెట్ దొరకని వారు కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డారే తప్ప ఈ పార్టీల టికెట్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. జనంలో ఈ పార్టీలకున్న బలానికి ఇదే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. సోషల్ మీడియా పేరుతో డాంబికాలు, అపోహలు, అపనిందలు ప్రచారంచేసే పేరుగొప్ప జాతీయ పార్టీలకు క్షేత్రస్థాయి పరిస్థితులు చుక్కలు చూపిస్తున్నాయి.
పోటీకి అభ్యర్థులు కూడా దొరకలేదంటే పరువుపోతుందనే ఉద్దేశంతో అవి వీలైన చోట్ల అనామకులను, పార్టీతో సంబంధం లేనివారిని, డివిజన్లో ఏమాత్రం గుర్తింపు లేనివారికి టికెట్లిచ్చాయి. కొన్నిచోట్ల చివరి నిమిషంలో స్వతంత్రులకు బీ ఫాం అంటగట్టి తమ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నాయి. పలు డివిజన్లు, వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్ని జనం గుర్తుపట్టడమే కష్టంగా మారింది. ఖమ్మంలో పలు డివిజన్లలో పోటీచేస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఆయా డివిజన్ల ఓటర్లే గుర్తుపట్టడం లేదు. మరి కొందరిని ‘అన్నా మీరు ఓట్లప్పుడే కనపడ్తన్నరే’ అని ప్రజలు నేరుగా మొహం మీదే నిలదీస్తుండడంతో అయా పార్టీల అభ్యర్థులు బిత్తరపోతున్నరు. ఇక కొత్తూరులో బీజేపీ అభ్యర్థులంతా సాధారణమే. ‘పలు పట్టణాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పక్కింటివారికి కూడా తెలుసా అన్న ఆనుమానాలున్నాయి. పరిస్థితి చూస్తుంటే అవి ముందే ఓటమిని అంగీకరించినట్టు కనిపిస్తున్నది. నా అంచనా నిజమైతే ఎన్నికలు జరుగుతున్న వరంగల్, ఖమ్మం నగరాలు, సిద్ధిపేట, నకిరేకల్, కొత్తూరు, అచ్చంపేట జడ్చర్లలో టీఆర్ఎస్ అభ్యర్థులకు 50 శాతం నుంచి 75 శాతం ఓట్లు టీఆర్ఎస్ అభ్యర్థులకే దక్కుతాయి. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మంచి మెజారిటీతో గులాబీ పార్టీయే గెలుస్తుంది. అన్ని చోట్లా మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. విపక్ష అభ్యర్థుల్లో చాలామందికి డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే’ అని సీనియర్ పాత్రికేయుడొకరు అన్నారు.
పక్కాగా కొవిడ్ నిబంధనలు
టీఆర్ఎస్ అభ్యర్థులు, నేతలు, కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఇల్లిల్లూ తిరుగుతున్నారు. తాము, రాష్ట్ర ప్రభుత్వంచేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లడుగుతున్నారు.
కొసమెరుపు… చేసిందో, చేసేదో చెప్పి ఓట్లడగలేని దుస్థితిలో ఉన్న బీజేపీ కేవలం లొల్లి చేయడం ద్వారానే ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమలో పడింది. గాలివాటానికి గెలిచిన దుబ్బాకను మోడల్గా తీసుకొని ఎక్కడికక్కడ, ఏదో ఒకరకంగా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. ఇటీవల వరంగల్లో, మొన్నటికి మొన్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ముందులేని సమస్య ముందు పెట్టి లొల్లిచేసిన ఆ పార్టీ, తాజాగా అచ్చంపేటలోనూ అలాంటి ప్రయత్నమే చేసింది. మరోవైపు సోషల్ మీడియా పేరుతో అపోహలను, అపనిందలను, అబద్ధాలను జనంలోకి తీసుకెళ్తున్నది. ఎక్కడ ఎన్నిక ఉంటే అక్కడ లొల్లిచేసే ఆ పార్టీ, పోలింగ్ అయిపోయిన మరుక్షణం ఆ విషయాన్ని మరిచిపోతున్నది. ఆదిలాబాద్లో లంబాడాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నల్లగొండలో లాంబాడాలకు అనుకూలంగా మాట్లాడుతుంది. కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైందని కోర్టులు మొదలుకుని పౌరుల దాకా గొంతు పెగిలి చెప్తుంటే బీజేపీ రాష్ట్ర నేత ఏమో ఆక్సిజన్, టీకా, రెమ్డెసివిర్ సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తారు. అవన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయని, వాటిని సరఫరా చేయాల్సింది కేంద్రమేనని కూడా తెల్వని పరిస్థితి.
టీఆర్ఎస్వైపే ప్రజలు
రాష్ట్రంలో టీఆర్ఎస్ మరో రెండున్నరేండ్లు అధికారంలో ఉంటుండటం, పట్టణ ప్రగతి రూపేణా మంచి అభివృద్ధి జరగడంతో ఓటర్లు విస్పష్టంగా తాము టీఆర్ఎస్వైపే అని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా ప్రతికూలంగా ఉందని ఫీడ్బ్యాక్ రావడంతో కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతలు మున్సిపోల్స్ ప్రచారానికి కూడా రాకుండా మొహం చాటేస్తున్నారు. ఆయా పార్టీలు పట్టణానికి ఓవరాల్ ఇంచార్జిలను కూడా నియమించకుండా వదిలేశాయి. పార్టీ నుంచి, నేతల నుంచి అండదండలు లభించకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా ఎందుకొచ్చిన ఇరకాటం అని మిన్నకుంటున్నారు.
అబద్ధాలు.. దుష్ప్రచారాలు..
అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయలేక.. సోషల్ మీడియాలో అబద్ధాలనే నమ్ముకుంటున్న వైనం ప్రజలను ముక్కున వేలేసుకునేలా చేస్తున్నది. కేవలం అబద్ధాలనే అస్ర్తాలుగా చేసుకుని.. టీఆర్ఎస్పై దుష్ప్రచారానికి దిగుతున్న బీజేపీని ఎవరూ నమ్మని పరిస్థితి నెలకొన్నది. లేనిది ఉన్నటు.. ఉన్నది లేనట్టు.. గారడీ విద్యలను ప్రతిపక్షాలు ప్రదర్శిస్తున్నాయి. సోషల్ మీడియాలో చేసే ప్రచారంలో ఏది నిజమైంది.. ఏది అబద్ధం అనేది ఎవరూ చెప్పరనే అపోహతో.. కాషాయ దళాలు.. కాంగ్రెస్ నేతలున్నారు. కానీ తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రత్యక్షంగా చూసి.. అనుభవిస్తున్న.. అందుకుంటున్న ప్రజలు మాత్రం ప్రతిపక్షాల గారడీలను చూసి నవ్వుకుంటున్నారు.
ఎక్కడికెళ్లినా.. కేసీఆర్ అభివృద్ధే కనిపిస్తున్నది
‘గతంతో పోలిస్తే ఈసారి పరిస్థితిలో ఏదో తేడా ఉన్నది. మున్సిపోల్స్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులు దొరకని వాతావరణాన్ని మొదటిసారి చూస్తున్నా. ఎన్నికలు జరుగుతున్న అన్ని వార్డులు, డివిజన్లలో అధికార పార్టీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను పెట్టింది. మేం మాత్రం అట్లా చేయలేకపోయాం. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ ఎంతో కొంత బాగ చేస్తున్నడు. ఇంతకన్నా ఎవరేం చేస్తరన్న మాటే వినిపిస్తున్నది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. ఆయన అన్న మాట అక్షరాలా నిజం. నకిరేకల్లో 20 వార్డులుండగా, నాలుగు చోట్ల కాంగ్రెస్, ఆరు చోట్ల బీజేపీ.. అభ్యర్థులనే నిలబెట్టలేకపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరాయి. ప్రచారంకోసం వస్తున్నానంటూ ఓ కాంగ్రెస్ ముఖ్యనేత హడావుడి చేసినా, జనం లేకపోవడంతో ఆ ఆలోచన మానుకున్నారు. ఇక కొత్తూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీజేపీల పరువంతా అభ్యర్థుల ఎంపికతోనే పోయింది. వార్డుల్లో నిలబెట్టేందుకు వారికి అభ్యర్థులే దొకరలేదు. ఇక్కడ ఐదుచోట్ల బీజేపీకి అభ్యర్థుల్లేరు. గతంలో కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉండింది. హైదరాబాద్ శివారులో ఉన్న ఈ పట్టణంలో కాంగ్రెస్ ప్రముఖులంతా టీఆర్ఎస్లో చేరిపోయారు.
హైదరాబాద్ను, శివార్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తీరుకు వారు ఇలా కృతజ్ఞతలు తెలిపారు. దీంతో అక్కడ కాంగ్రెస్ ఉనికి నామమాత్రమైంది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఒక్కరిని తాము గెలిపించుకున్నా, గెలిచినట్టేనని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇక బీజేపీ సంగతి సరేసరి. కనీసం ఒక్క వార్డులో కూడా అది బలమైన అభ్యర్థిని నిలబెట్టలేకపోయింది. ఇక టీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేటలో 43 వార్డులుండగా, బీజేపీ మూడు చోట్ల బరిలో నిలవలేకపోయింది. కాంగ్రెస్కైతే ఏకంగా 13 సీట్లలో అభ్యర్థులు దొరకలేదు. సిద్ధిపేటలో పోటీ చేస్తున్న జిల్లా బీజేపీ అధ్యక్షుడి పరిస్థితే అయోమయంగా ఉన్నది. ‘సిద్దిపేటలో అభివృద్ధి హైదరాబాద్కు దీటుగా ఉన్నది. అది కండ్లముందు పంచరంగుల్లో కనిపిస్తున్నది. ఇక మేం ఎవరిని తప్పుబట్టగలం? ఏమని ఓట్లు అడగగలం?’ అని సిద్దిపేటకే చెందిన బీజేపీ యువ నాయకుడొకరు అన్నారు. పోటీచేయాలని పోటీ చేయడం తప్ప తమ పరిస్థితి ఏమిటో తమకు ముందే తెలుసని కూడా ఆయన నిజాయితీగా అంగీకరించారు.