అన్నీ ఆన్లైన్ మయం అయిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దొంగలు కూడా ఆన్లైన్లోనే దోచుకుంటున్నారు! అది కూడా చిల్లర దొంగతనాలు కాదు.. కొడితే లక్షల్లోనే.. ఇంకా మాట్లాడితే కోట్లే! ఇలాంటి సైబర్ నేరాల పట్ల దేశంలో 73% మంది ఇంటర్నెట్ యూజర్లు అవగాహన కలిగి ఉన్నప్పటికీ.. పాస్వర్డ్లు పెట్టుకోవడంలో మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో అప్రమత్తంగా లేరని సైబర్ సెక్యూరిటీ సంస్థ నోర్టన్ పేర్కొన్నది. 43% మందే స్ట్రాంగ్పాస్వర్డ్ పెట్టుకుంటున్నారని ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఎలాంటి సైబర్ నేరాన్నైనా అడ్డుకునేందుకు బలమైన ఆయుధం మనం మన ఖాతాలకు ఉపయోగించే ‘స్ట్రాంగ్’ పాస్వర్డేనని నిపుణులు చెప్తున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఇంటికి బలమైన తాళం ఎంత ముఖ్యమో.. మన సోషల్ మీడియా అకౌంట్లకు, ఆన్లైన్ బ్యాంక్ అకౌంట్లకు బలమైన పాస్వర్డ్ అంతే ముఖ్యం. లేదంటే సైబర్ నేరగాళ్లు చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు సైబర్ సెక్యురిటీ నిపుణులు. మనం ఏదైనా ఎకౌంట్కు పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోగానే.. అది స్ట్రాంగ్గా ఉన్నదా? లేదా అనే విషయం అక్కడే తెలిసిపోతుంది. కొద్దిగా సమయం వెచ్చిస్తే.. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ.. భారతదేశంలో సామాజిక మాధ్యమాలను, ఇతర ఆన్లైన్ వ్యవహారాలను ఉపయోగించేవారిలో సగానికిపైగా బలహీనమైన పాస్వర్డ్లే ఉంటున్నాయని సాఫ్ట్వేర్ సెక్యూరిటీ సంస్థ నోర్టన్ వెల్లడించింది. గోప్యంగా ఉంచుకోవాల్సిన వ్యక్తిగత వివరాలను 64% మంది సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి భయం లేకుండా పెడుతున్నారని తెలిపింది.
ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని, సులభంగా తెలుసుకోగలిగిన పాస్వర్డ్లు ఉండటం, ఇష్టారాజ్యంగా వ్యక్తిగత సమాచారాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుండటంతో వారికి మరింత ఊతం లభించినట్టు అవుతున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ సెక్యురిటీ, సైబర్ నేరాలు అనే అంశంపై సాఫ్ట్వేర్ సెక్యురిటీ సంస్థ నోర్టన్ ఇటీవల భారత్ సహా పది దేశాల్లో సర్వేలో నిర్వహించింది. గత ఏడాదికాలంగా సైబర్ నేరగాళ్ల ముప్పు 70% పెరిగిందని భారతీయులు చెప్పారు. తాము ఏదో ఒక రకమైన సైబర్ నేరానికి బాధితులయ్యామని 52శాతం మంది పెద్దవారు అంగీకరించారట. సైబర్ ముప్పు పెరుగుతున్న వేళ.. పక్కా పాస్వర్డ్ పెట్టుకోవడమే మన ఆన్లైన్ అకౌంట్లకు శ్రీరామ రక్ష అని నిపుణులు చెప్తున్నారు.
పాస్వర్డ్ను ఇలా హ్యాక్ చేస్తున్నారు!
సైబర్ నేరగాళ్లు పలు రకాల టెక్నిక్స్తో మన పాస్వర్డ్లను హ్యాక్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా డార్క్వెబ్సైట్ల నుంచి అకౌంట్ల వివరాలను కొనుగోలు చేస్తున్నారు. వాటి పాస్వర్డ్లు తెలుసుకునేందుకు బ్రూట్ఫోర్స్ ఎటాక్, డిక్షినరీ ఎటాక్, ఫిషింగ్ తదితర పద్ధతులు ఉపయోగిస్తున్నారు.
బ్రూట్ఫోర్స్ ఎటాక్
మన పేరు, పుట్టిన తేదీ, ఊరు పేరు, పాఠశాల పేరు.. ఇలా కొంత సమాచారం ఏదైనా తెలిస్తే దాన్ని సైబర్ నేరగాళ్లు పలు కాంబినేషన్స్లో పెట్టి పాస్వర్డ్ను తెలుసుకుంటారు. ఈ టెక్నిక్తో ఒక సెకన్కు 35 వేల కోట్ల కాంబినేషన్లను సైబర్ నేరగాళ్లు లెక్కించగల్గుతారు. ఆ పాస్వర్డ్ 12 అక్షరాల లోపుంటే వీళ్ల పని చాలా ఈజీ అవుతుంది. మనలో ఎంతమంది పాస్వర్డ్లు 12 అక్షరాలకంటే ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది.
ఫిషింగ్ ఎటాక్
మన బ్యాంకు ఖాతా, క్రెడిట్, డెబిట్కార్డులు ఇలా ఏదో ఒకదాంట్లో కొంత సమాచారం యాడ్ చేయాలని కంపెనీ నుంచి పంపినట్టు లింకులు పంపుతారు. దానిలో మనం ఇచ్చే వివరాలతో పాస్వర్డ్ను తెలుసుకుంటున్నారు.
డిక్షనరీ ఎటాక్
డిక్షనరీలోని పదాల మాదిరిగా మన పాస్వర్డ్లోని పదాలను మ్యాచ్ చేస్తూ వాటి ద్వారా పాస్వర్డ్ కనిపెడతారు.
స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండిలా..
పాస్వర్డ్ వీలైనంత ఎక్కువ పొడవు ఉండేలా పెట్టుకోవాలి. కనీసం 15 అక్షరాలకు తగ్గకుండా ఉంటే మరింత సురక్షితం.
పెద్ద, చిన్న అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్స్.. ఇలా పలు కాంబినేషన్స్లో పెట్టుకోవడం ఉత్తమం.
కొందరు 1234 అంటూ అంకెల వరుసలు.. లేదంటే అక్షరాల వరుసలు పెడతారు. అది చాలా ప్రమాదం. వీలైనంత వరకు అన్నింటి మిక్సింగ్.. కొన్ని పదాల్లో మధ్యలో అక్షరాలను రిపీట్ చేయడం.. ఇలా మనకు తోచిన విధంగా పెట్టుకోవచ్చు.
అత్యంత ముఖ్యమైనది పాస్వర్డ్లు తరచూ మార్చడం. ప్రతి నెల, రెండు నెలలకైనా పాస్వర్డ్లు మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు. పాస్వర్డ్లు గుర్తుపెట్టుకోవడం కష్టమంటూ కొందరు అన్ని ఆన్లైన్ అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్లకు ఒకే పాస్వర్డ్ పెడుతుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్క ఖాతాను పట్టారంటే.. ఆటోమేటిగ్గా అన్ని ఖాతాలు వారి గుప్పిట్లోకి వెళ్లిపోతాయి.
అవకాశం ఉన్న ప్రతిచోట మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (ఎంఎఫ్ఏ) పెట్టుకోవాలి. మొదటి స్టెప్లో మీ పాస్వర్డ్ తెలిసినా.. సైబర్ నేరగాడు మీ అకౌంట్లోకి రావాలంటే సాధ్యం కాదు. రెండో స్టెప్లో మీరు పెట్టుకున్న అథెంటికేషన్ మీ వేలిముద్ర, ఐ స్కాన్, రెండో పాస్వర్డ్ తెలియాల్సి ఉంటుంది. ఇది మనల్ని కాపాడుతుంది.
43% మంది స్ట్రాంగ్పాస్వర్డ్ను పెట్టుకుంటున్నారు.
36% మంది సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని వీలైనంత తక్కువగా షేర్ చేస్తున్నారు.
63% కరోనాకు ముందుతో పోలిస్తే సైబర్ నేరగాళ్ల బారిన ఎక్కువ పడతామేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
72% గతంలో కంటే ఎక్కువగా ఆన్లైన్లో గడుపుతున్నారు.
70% వర్క్ఫ్రం హోం కారణంగా సైబర్ నేరగాళ్ల బారినపడే రిస్క్ పెరిగిందన్న ఆందోళనలో ఉన్నారు.
73% సైబర్ నేరాలపై అవగాహన కల్గి ఉంటున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా వీలైనన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారు.
గత 12 నెలల్లో 2.7 కోట్లకుపైగా భారతీయులు ఐడెంటిటీ థెఫ్ట్ బాధితులే.
దాదాపు 12 కోట్లమంది భారతీయులు సైబర్ నేరాల బారినపడ్డారు.
సైబర్ నేరగాళ్లు సృష్టించిన చిక్కుల నుంచి బయటపడేందుకు 130 కోట్ల గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.