న్యూఢిల్లీ : ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు అల్లాడుతుంటే ఆపద సమయంలో ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రాణవాయువు అందక రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతానికి చెందిన 51 ఏండ్ల వ్యక్తి తన ఇంట్లో 32 పెద్ద ఆక్సిజన్ సిలిండర్లు, 16 చిన్న ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేసి భారీ మొత్తానికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీసీపీ ప్రతాప్ సింగ్ తెలిపారు. భారీ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి ఆక్సిజన్ ను మళ్లిస్తూ వాటిని ఒక్కోటి రూ 12,500 చొప్పున విక్రయిస్తున్నాడని దర్యాప్తులో తేలిందని చెప్పారు. నిందితుడిని అనిల్ కుమార్ గా గుర్తించిన ఢిల్లీ పోలీసులు అతడి వద్ద నుంచి ఆక్సిజన్ సిలిండర్లను సీజ్ చేశారు.