యాసంగిలో కనీవినీ ఎరుగని రీతిలో చేతికొస్తున్న సంపద
కొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్న వరి ధాన్యం
జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,920 టన్నుల ధాన్యం కొనుగోళ్లు
రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.3.62 కోట్లు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత యేడాది విస్తారంగా వర్షాలు కురవడం.. చెరువులు, కుంటల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉండడం.. బోరు బావుల్లో నీటి మట్టాలు పెరగడం..దీనికితోడు పెట్టుబడి సాయం, 24 గంటల నిరంతర విద్యుత్ ఉపయుక్తంగా మారడంతో యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో రైతుల ఇంట సిరుల పంట పండింది. అకాల వర్షాలు కొంత నష్టాన్ని కల్గించినప్పటికీ వరి దిగుబడులు ఊహించిన దానికంటే ఎక్కువగానే రైతుల చేతికందివస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. జిల్లా రైతాంగం ప్రభుత్వ రంగ సంస్థల్లోనే తమ పంటలను విక్రయించేందుకు ఆసక్తి చూపడంతో కేంద్రాల వద్ద కొనుగోళ్ల సంబురం నెలకొంది. జిల్లాలో ఇప్పటివరకు 220 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా..170 మంది రైతులకు సంబంధించి 1,920 టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇందుకు సంబంధించి రూ.3.62కోట్ల చెల్లింపులు రైతుల బ్యాంకు ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో జమకానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు నెలకొనడంతో యాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గోదావరి, మూసీ జలాలతోపాటు ప్రభు త్వ పరంగా అవసరమైన సాయం సకాలంలో అందడంతో రైతులు వరిని పెద్దమొత్తంలో సాగు చేశారు. ఈ యాసంగి లో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 2.40 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయగా.. 4.80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వరి దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. వరి కోతలు కూడా ముందుగానే ప్రారంభం కావడం తో దండిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలివస్తున్నది. కొవిడ్ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేసేందుకు రైతులు ఇబ్బంది పడకుండా పండించిన ప్రతి గింజనూ కొనేందుకు ప్రభుత్వం సిద్ధపడి ఆ దిశగా ఏర్పాట్లు చేసింది. కిలోమీటర్ల దూరం వెళ్లి పంటలను విక్రయించుకునే దుస్థితి పోయి.. ఉన్న ఊర్లోనే ప్రభుత్వమే మద్దతు ధరకు కొంటున్నది.
1,920 టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాలు గు కేంద్రాలు, ఐకేపీల ఆధ్వర్యంలో 98 కేంద్రాలు, పీఏసీఎస్ల ఆధ్వర్యంలో 186 కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. గతంలో జిల్లాలో కొద్దిపాటిగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు కిలోమీటర్ల దూరం నుంచి ధాన్యాన్ని రైతులు తీసుకువచ్చి విక్రయించేవారు. లేదంటే కల్ల్లాల వద్ద నే దళారులకు అమ్ముకునేవారు. అయితే తెలంగాణ ప్రభు త్వం స్థానికంగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను తీర్చింది. కొవిడ్ పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి ధాన్యం కొనుగోళ్ల ద్వారా ప్రభుత్వం కొండంత ధైర్యాన్నిచ్చింది. యాసంగిలో 2.40 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వగా..4.80 లక్షల మెట్రిక్ టన్ను ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 170 మంది రైతుల నుంచి 1,920 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గ్రేడ్-ఏరకానికి రూ.1,888, గ్రేడ్-మీ రకానికి రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వం కల్పించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.3.62 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో సంబంధిత డబ్బులను జమచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఊహించిన దానికంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తున్నది. ఎక్కడా రైతులు ఇబ్బం ది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి గింజనూ ప్రభు త్వం కొనుగోలు చేస్తున్నందున రైతులు ఆందోళన చెందొద్దు. జిల్లావ్యాప్తంగా 288 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా.. ఇప్పటికే 220 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. విక్రయించిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
-గోపీకృష్ణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
ఇవి కూడా చదవండి
కార్బైడ్ తో పండించిన మామిడి పండ్లలను ఇలా గుర్తించండి..!
ఉదయం నిద్రలేవగానే చేయాల్సిన పనులివే..!