చందుర్తి, ఏప్రిల్ 19: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల శివారులోని దేవునితండాకు చెందిన గుగులోత్ చిన్నరాములు కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. కొన్నేండ్ల కిందట ఉపాధి కోసం చిన్నరాములు సౌదీ అరేబియా వెళ్లారు. కొన్ని నెలలు పనిచేయించుకున్న కంపెనీ.. వేతనం ఇవ్వడం లేదని, భోజనం కూడా పెట్టడంలేదని, స్వగ్రామానికి పంపడం లేదని సాయం చేయాలని వీడియో ద్వారా మంత్రి కేటీఆర్ను కోరారు. సోమవారం ఎంపీటీసీ మాదాసు వేణు ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్కు పంపించారు. స్పందించిన కేటీఆర్.. సౌదీ అరేబియాలోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. ఎంబసీ అధికారులు చిన్నరాములు పనిచేస్తున్న కంపెనీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్కు చిన్నరాములు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.