డిచ్పల్లి, ఏప్రిల్ 8 : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)తో దక్షిణ మధ్య రైల్వే అనుసంధానం వ్యాపారులతోపాటు నిరుద్యోగ యువతకు వరంలా మారింది. డిచ్పల్లి ప్రాంత వాసుల నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. డిచ్పల్లిలో నలభై ఏండ్ల క్రితమే ఎఫ్సీఐ గోదాములు ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రైళ్ల రద్దీని తగ్గించేందుకు డిచ్పల్లిలోని గోదాములను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునేందుకు స్థానిక రైల్వే స్టేషన్లో గూడ్స్ షెడ్ను అభివృద్ధిచేసి గత నెల 31వ తేదీన ప్రారంభించారు.
భవిష్యత్లో మరింత అభివృద్ధి
డిచ్పల్లిలో ప్రస్తుతం 10వేల మెట్రిక్ టన్నుల సరుకు నిల్వ చేసే సామర్థ్యం ఉన్న గోదాములు ఉన్నాయి. రైల్వేతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్లో సరుకుల నిల్వ సామర్థ్యాన్ని 50వేల మెట్రిక్ టన్నులకు పెంచే అవకాశం ఏర్పడిందని ఎఫ్సీఐ అధికారులు, వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఇది అభివృద్ధికి సంకేతమని అధికారులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక్కడి ఎఫ్సీఐ గోదాముల ద్వారా ఇప్పటివరకు కేవలం లారీలు, ట్రక్కుల ద్వారా మాత్రమే ఎరువులు, ఆహార ధాన్యాలు, సరుకు రవాణా జరిగేది. రైల్వేతో అనుసంధానం చేయడం ద్వారా కర్ణాటక, కేరళ, తమిళనాడుతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచే సరుకు రవాణా చేయనున్నారు.
ఇందూరుపై తగ్గనున్న భారం
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా గతేడాది దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. లాక్డౌన్కు ముందు ఈ మార్గంలో ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు రోజుకు సుమారు 60 వరకు నడి చేవి. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల రద్దీ పెరగడం, దీనికితోడు నిజామాబాద్లో నాందెడ్ తరహా ప్రత్యేకంగా గూడ్స్ కోసం స్టేషన్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. గూడ్స్కోసం ప్రత్యేకంగా స్టేషన్ ఏర్పాటు సాధ్యం కాకపోవడంతో డిచ్పల్లిలోని ఎఫ్సీఐ గోదా ములతో అనుసంధానం చేశారు.దీంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల రద్దీ తగ్గనుంది. ప్రస్తుతం ఉన్న గోదాముల నిల్వ సామర్థ్యం భవిష్యత్లో మరింత పెంచే అవకాశం ఏర్పడింది.
ఇవీ కూడా చదవండీ…
టాలీవుడ్పై కన్నేసిన మరో కన్నడ హీరో..ఫస్ట్లుక్
11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్: ప్రధాని మోదీ
ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతర కృషి : టీజీవో