మియాపూర్, ఏప్రిల్ 5 : నియోజకవర్గంలోని చెరువులను కబ్జాకు గురికాకుండా పరిరక్షించుకోవటంతో పాటు పచ్చదనపు ఆహ్లాదానికి నెలవుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని, ఇప్పటికే పలు చెరువులను దత్తత తీసుకుని సొంత నిధులతో అభివృద్ధి పరుస్తున్నట్లు విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హైదర్నగర్ డివిజన్లో అంబీర్ చెరువులో జరుగుతున్న సుందరీకరణ పనులను సోమవారం విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు నిలిచిపోవటం వల్ల గుర్రపు డెక్క పెరిగి దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
పనులను వేగవంతంగా చేపట్టాలని, చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, పచ్చని మొక్కలను పెంచాలని సూచించారు. మురుగు నీరు చెరువులో కలువకుండా ప్రత్యేక చానళ్ల ద్వారా మళ్లించాలని, కేవలం వర్షపు నీరు మాత్రమే వచ్చేలా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని విప్ గాంధీ ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులను ముగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాస్యాదవ్, కాశీనాథ్యాదవ్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల సంరక్షణ, సుందరీకరణ పనుల్లో వేగాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారం పెద్ద చెరువు, పటేల్కుంట చెరువుల్లో కొనసాగుతున్న సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 31.26 కోట్ల వ్యయంతో గంగారం పెద్ద చెరువు, పటేల్కుంట చెరువుల్లో సుందరీకరణ పనులను ప్రారంభించామని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. చెరువుల సంరక్షణతో పాటు చుట్టూ వాకింగ్ ట్రాక్లు, చెట్ల పెంపకం, చెరువుల్లోకి డ్రైనేజీ మురుగు చేరకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్, కాశీనాథ్ యాదవ్ ఉన్నారు.