భద్రాద్రిలో 43, ఖమ్మం నగరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు
అశ్వారావుపేటలో 42 డిగ్రీలు నమోదు
రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న ఎండలు
గనుల్లో’ మరింత వేడి
కొత్తగూడెం, ఖమ్మం మార్చి 31: భానుడు భగ్గుమంటున్నాడు. వాతావరణం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. ఉష్ణ తాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉదయం 10 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగలు పిల్లలు, వృద్ధులు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు. భద్రాద్రి జిల్లాలో ఈ నెల 26న 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా.. బుధవారం ఏకంగా 43 డిగ్రీలకు చేరింది. అశ్వారావుపేటలో 42, ఖమ్మంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రధాన కూడళ్లు, రహదారులు మధ్యాహ్నం నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నది.
భానుడు భగ్గుమంటున్నాడు.. ఉదయం 10 గంటల నుంచే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. మార్చి ముగియకముందే దంచికొడుతున్నాడు.. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రరూపం దాల్చుతోంది. మునుపటికి భిన్నంగా వేసవి ఆరంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం భద్రాద్రి జిల్లాలో 43, అశ్వారావుపేటలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాడగాలులు వీయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఈ నెల 26న 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా.. బుధవారం ఏకంగా 43 డిగ్రీలకు చేరింది. ప్రధానంగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో ఉష్ణతాపానికి ప్రజ బెంబేలెత్తి పోతున్నారు. సింగరేణి ప్రాంతం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ప్రధాన కూడళ్లు, రహదారులు మధ్యాహ్నం నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. మార్చి నెల మధ్య నుంచే వేసవి వాతావరణం కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు అమాంతం ఎండలు పెరిగాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఉదయం, సాయంత్రం మాత్రమే బయటకు రావాలన్నారు. తరచూ ద్రవపదార్థాలు తాగాలని సూచిస్తున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలంటున్నారు.
ఫ్రిజ్లు, కూలర్లకు గిరాకీ..
ఎండ తాపానికి తాళలేని ప్రజలు కూలర్లను ఆశ్రయిస్తున్నారు. మార్కెట్లో ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్ల అమ్మకాలు పెరిగాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ వరకు ఉన్న దుకాణాలు బిజీ బిజీగా దర్శనమిస్తున్నాయి. అలాగే శీతల పానీయాలకూ గిరాకీ పెరిగింది. ఇప్పటికే ప్రధాన కూడళ్లలో జ్యూస్ సెంటర్లు వెలిశాయి. పుచ్చకాయల అమ్మకాలు పెరుగుతున్నాయి. వీధుల్లో నిమ్మరసం, చెరకు రసాలు అమ్మేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది.
భవిష్యత్ ప్రమాదకరమే..
వేసవిలో ఈ సీజన్ ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకుంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందోనని ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఈ నెల 21 నుంచి బుధవారం వరకూ వరుసగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ప్రతిరోజూ 35 డిగ్రీలకు తక్కువకాలేదు. ఇక ఏప్రిల్, మే నెలల్లో కచ్చితంగా యాభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదముందని వాతావరణ నిఫుణులు చెబుతున్నారు. దీంతో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు. మనుషులు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల సాయంతో ఊరటచెందే అవకాశం ఉన్నప్పటికీ.. మూగ జీవాల మనుగడ కష్టసాధ్యమయ్యే ప్రమాదముందంటున్నారు.
ఊపందుకున్న ‘శీతల’ విక్రయాలు..
వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతుండటంతో శీతల పానీయాలు, పండ్ల రసాలు, కొబ్భరి బొండాల వినియోగం పెరిగింది. రకరకాల పనుల కారణంగా బయటికి వస్తున్న ప్రజలు మధ్యాహ్నం సమయంలో నిమ్మరసం, చెరుకు రసం, కూల్డ్రింక్స్ తాగుతున్నారు. దాహార్తిని పారదోలే పుచ్చకాయలు కొనుగోళ్లు కూడా పెరిగాయి. కొబ్బరిబొండాల ధరలు అమాంతం పెరిగాయి. మొన్నటి వరకు రూ.20 ఉన్న కొబ్బరి బొండాం ధర ప్రస్తుతం రూ.30 పలుకుతోంది. ఇక బార్లు, రెస్టారెంట్లు, వైన్ షాపుల్లో మందుబాబులు బీర్లను తెగ తాగేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రుద్రంపూర్, సత్తుపల్లి ఏరియాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచే వడగాలులు వీస్తున్నాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. దీంతో యాజమాన్యం కార్మికుల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నది. కార్మికులకు వడదెబ్బ తగలకుండా గురువారం నుంచి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయనుంది. అవసరమైతే వైద్యశిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇవి కూడా చుడండి
పాన్-ఆధార్ అనుసంధానం గడువు 3 నెలలు పొడిగింపు