దేశంలో ఒక రకమైన సంధి దశలో కీలకమైన ఆర్థిక సంస్కరణలను తీసుకొచ్చిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు.. ఆ ఫలితాలు ప్రజలకు మేలు చేయాలని ఆశించారు. స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల ద్వారా దేశంలో ఏం మార్పులు వస్తాయనేది ప్రజలకు వివరంగా అర్థం కావాలని కోరుకున్నారు. అందుకు ప్రభుత్వ యంత్రాంగానికి తోడు ప్రజా సంబంధాల రంగం తోడ్పాటు ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 1992 నవంబర్ 13న న్యూఢిల్లీలో జరిగిన 15వ అఖిల భారత ప్రజా సంబంధాల సదస్సులో తన భావాలను పంచుకున్నారు. ఆ ప్రసంగానికి తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ సంయుక్త సంచాలకుడు కన్నెకంటి వెంకటరమణ సంక్షిప్త అనువాదమిది.
ప్రజాసంబంధాల రంగంలో అపార అనుభవం కలిగిన మీ అందరి మధ్యకు వచ్చి నేను చెప్పదలచుకున్న విషయం ఒకటుంది. ఒక విషయాన్ని ప్రజల మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేసి, వాళ్ల నమ్మకాన్ని ప్రభావితం చేసే శక్తి మీకుంది. మీ సామర్థ్యాలకు, నైపుణ్యాలకు ఉన్న శక్తి అది. ఇప్పుడు నేను ఈ దేశానికి ఏది అవసరమో, ఈ ప్రపంచానికి ఏది అవసరమో, దేనినైతే నేను పూర్తిగా విశ్వసించానో, ఈ దేశ ప్రజలు కూడా పూర్తిగా విశ్వసించగలరని నమ్ముతున్నా.. దానిని నేను అమ్ముతున్నాను. ఈ దేశంలో మనం ఇప్పుడు చేస్తున్న పని సరైన పని అని, ఆ పని చేయడానికి ఇదే తగిన సమయమనే విషయాన్ని అమ్ముతున్నాను. అదే నమ్మకంతో నేను ఇవ్వాళ మీ ముందుకు వచ్చాను. నేను ఏదైతే చెప్పలేకపోతానో, ప్రజలకు అర్థం చేయించలేకపోతానో ఆ విషయాలు ప్రజలకు అర్థం చేయించడంలో మీ అనుభవం చాలా అవసరమని ఆశించి మీ ముందుకువచ్చాను.
ఇప్పుడు మేం చేస్తున్న ఆలోచనలు, చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజలందరికి, ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా చేయాలంటే ఇంకా చాలా చేయాలి. చాలా దూరం పయనించాలి. ఎన్నో దశాబ్దాలుగా మనం మాట్లాడుతున్న ఒక నూతన అంతర్జాతీయ సమాజం ఇవ్వాళ అందరికీ కనబడుతున్న ఒక వాస్తవం. తేడా ఏమిటంటే- సానుకూల వాతావరణం లేనప్పుడు మనం ఏదైతే మాట్లాడామో, దానినే మనం ఇప్పుడు సానుకూల వాతావరణంలో మాట్లాడాల్సి రావడం. ఇవ్వాళ, ప్రపంచం తన భాష మార్చుకున్నది. మనం దానిని మార్చాల్సిన పని లేదు. మనం ఎన్నో ఏళ్లుగా ఏదైతే మాట్లాడామో, అదే పరిభాషను ఇవ్వాళ మొత్తం ప్రపంచం మాట్లాడుతున్నది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూడాలని అనుకుంటే- శతాబ్దాలు, శతాబ్దాల వెనక్కి చూడాలనుకుంటే – మనం మాట్లాడిన శాంతి, మనం మాట్లాడిన సహకారం, మనం మాట్లాడిన అహింస – ఇలాంటి పదాలన్నీ ఇవ్వాళ ఫ్యాషన్ పదాలుగా మారిపోయాయి.
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది సహకారం, చర్చ. ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య సర్దుబాటు ధోరణి. సంపన్న, పేద వర్గాల మధ్య అంతరం తగ్గించడం. తమకు కావాల్సినదానికన్నా ఎక్కువ ఉన్నవాళ్లు, తమకు అవసరం ఉన్నదానికంటే కూడా తక్కువ ఉన్న వాళ్ల మధ్య అంతరం తగ్గించడంపై సర్దుబాటు: వినాశకర సాంకేతికత వినియోగంతో ప్రకృతిని దుర్వినియోగం చేసినవాళ్లు- ప్రకృతికి హాని కలిగించని పరిశుద్ధ సాంకేతికత ఆసరాగా ప్రకృతితో సహజీవనం చేసేవాళ్ల మధ్య సర్దుబాటు: వేల సంవత్సరాలుగా ప్రకృతితో కలిసి బతుకుతున్న వాళ్లున్నారు; ప్రకృతి నాశనం కాకుండా ఉండే పద్ధతులు, సానుకూల సాంకేతికత కోసం ఇలాంటివాళ్లు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి సంధికాలంలో మనం ఇప్పుడున్నాం. ఇలాంటి అంశాలన్నిటికీ, ఘర్షణపూరిత వైఖరితో కాకుండా చర్చల ద్వారా పరిష్కారం వెతుక్కోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు కావాల్సింది ఆలోచనల కలయిక. పొద్దనకా, రాత్రనకా ఆయా అంశాల మీద విభేదించేవాళ్లతో మాట్లాడుతూ, వాళ్లను ఒక అంగీకార వేదిక మీదకు తీసుకురావాల్సిన అవసరం ఇది. ఈ కొత్త పనిని ఇప్పుడు తలకెత్తుకోవాలి. ప్రజా సంబంధాల వ్యవహారాలను సంప్రదాయ ధోరణిలో చూసే వ్యక్తుల ఊహకు కూడా అందని రీతిలో కొత్త రకం ప్రజా సంబంధాలు దానికి అవసరం. దానికోసం, మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవాల్సి రావచ్చు.
మీ అనుభవాన్ని మరింత మెరుగుపరచుకోవాల్సి రావచ్చు. ఈ రంగంలో మీరంతా కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా పనిచేస్తున్న క్రమంలో, మీలో కొంతమంది పాత తరం నిపుణులతో కూడా కలిసి పనిచేసి ఉండవచ్చు. ప్రజా సంబంధాల పనులు కొత్త పంథాలోకి వెళ్ళేటప్పుడు కొన్ని కొత్త నైపుణ్యాలు అవసరమవుతాయి. ప్రజలను ఒప్పించడానికి కొత్త పద్ధతులు అవసరమవుతాయి. ఇలాంటి కొత్త పరిస్థితిలో ఇప్పుడు మీరు, నేను జీవించాల్సి ఉంది. మన పనులు మనం నిర్వర్తించాల్సి ఉంది. మనం ఆశించిన నూతన ప్రపంచ వ్యవస్థ ఏదో ఊడిపడ్డట్టు కాకుండా, అనుకోకుండా జరిగినట్టు కాకుండా, ఒక స్పష్టమైన ప్రణాళికతో రూపొందినదిగా ఉండాలి. ఈ క్రమంలో మీరు ఇప్పుడు చరిత్ర మలుపులో ఉన్నారు. ఈ క్షణంలో మీరు ఏ మలుపు తీసుకుంటారు అనేదానిపై సర్వం ఆధారపడి ఉంది. మనం తప్పుడు తోవ ఎంచుకుంటే, ఆయా దేశాల కూటములు, ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల నడుమ ఇప్పటివరకు మనం చూసిన పరిస్థితిలో మార్పు ఏమీ ఉండదు. ఇవ్వాళ ప్రజా సంబంధాల అంశానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇక్కడే. మీకు మీరు స్పష్టంగా ఆలోచించుకోవాలి. అవతలివాళ్లకు మీ స్పష్టతను తెలియచేయటానికి కావాల్సిన నైపుణ్యాలను ఆలోచించాలి. ఇక్కడ అవతలివాళ్లు అంటే మనం చెప్పేదాన్ని పూర్తిగా అంగీకరించని వాళ్లు. నిజానికి ఇలాంటి అవతలివాళ్లు ఎవరూ లేరు. ఇదేమీ ఘర్షణ పూరిత సందర్భం కాదు.
అన్నిరకాల హంగులు ఉన్నవాళ్లు ఇప్పుడు సమాజంలో మిగతావాళ్లు కూడా తమలాగే సంతోషంగా ఉండటానికి, ఒకింత ఇబ్బంది లేని బతుకు బతకడానికి కాసిం త త్యాగం చేయాల్సిన సమయం. అటువంటి చర్చ ఇప్పుడు జరగడం లేదు. ఉత్తర దక్షిణ ధ్రువాల కలయిక లేదా ఉత్తర దక్షిణ అవగాహన పెంపొందించే ఒక్క వేదికను నాకు చూపించండి. అలాంటివి మన దగ్గర లేవు. ఎక్కడైనా సంప్రదాయ ఆలోచనా ధోరణులకే మాట చెల్లు; మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మన సూత్రాలను అన్వయించుకోవడం లేదు. అందుకే, పాత మూస ధోరణులే ఇంకా కొనసాగుతున్నాయి.
ఏదో కొంత మార్పు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది చాలా మెల్లగా జరుగుతున్నది. జరగాల్సిన స్థాయిలో ఆ మార్పు జరగడం లేదు. మనం వాటి నుంచి మొత్తంగా బయటపడలేదు. మనం కొత్త ధోరణిలోకి ఇంకా అడుగిడలేదు. దీని గురించి ఒక్క మాటలో స్పష్టంగా చెప్పాలంటే, మనం పాత, కొత్తల సంధికాలంలోనే ఇంకా ఉన్నాం. ఈ సమయంలోనే సరైన ప్రజా సంబంధాలకు మీరు బా టలు వేయాలి. మనం ఈ దేశం కోసం, మానవత్వం కోసం ఏది చేయాలని అనుకుంటున్నామో దాన్ని ప్రజలకు చేరవేసే ప్రజా సం బంధాలు ఇప్పుడు అవసరం. ఈ కాలానికి ఇది చాలా అవసరం.
అభివృద్ధి చెందుతున్న దేశాల అంశాలను ప్రస్తావించే విషయంలో మన దేశం ఎప్పుడూ అంతర్జాతీయ స్థాయిలో చురుకైన పాత్రనే పోషించింది. దేశ స్వాతంత్య్ర సమరాన్ని నడిపించిన నాయకుల ఆశయాలు, విలువలను ఎప్పుడూ మరవలేదు. వాటిని మన రాజ్యాంగంలో పొందుపర్చుకున్నాం. మన దేశీయ, అంతర్జాతీయ విధానాలలో పొందుపర్చుకున్నాం. ఆ విలువలు, ఆశయాలే మన విధానాలను నడిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహారాలకు మార్గదర్శనం చూపిస్తున్నాయి. అవును, ఇది నిజం. అయితే, వాటిని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలో అంతవరకు తీసుకెళ్లలేకపోయాం.. ఇది కూడా నిజం. మనం సంస్కరణలను తీసుకువచ్చాం. ఈ సంస్కరణలకు ఇక తిరోగమనం లేదు. వాటిని పునః సమీక్షించేది కూడా లేదు. ఇది నిజం. అయితే, వాటికి అవసరమైన ప్రోద్బలం లేకపోతే, అవసరమైనంత ప్రచారం లేకపోతే, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కూడా వాటిని మార్చలేం. కానీ వాటివల్ల ఏమీ కాకుండా ఉంటుంది. మనం అనుకున్నది ఏదీ అప్పుడు జరుగదు. ఇలాంటి కీలక సంస్కరణలను ప్రజల చేరువకు చేర్చే సేల్స్మాన్ బాధ్యతలను కేవలం భారత ప్రధానమంత్రి మాత్రమే చేపట్టలేరు. నిజానికి నేను అందులో పూర్. నేను చేయగలిగింది వాస్తవాలను ముందుంచడమే. భారతదేశం ఇప్పుడు ఒక సరికొత్త పంథాలోకి అడుగుపెట్టిందని, కొంతమట్టుకు అవసరం మేరకే అయినా, పూర్తి విశ్వాసంతో ఆ బాట పట్టిందని అందరికీ నచ్చచెప్పడానికి చేయాల్సింది చాలా ఉంది. ఇవ్వాళ మనం టన్నెల్ చివరకు వచ్చాం.
మనల్ని ఇప్పటివరకు నడిపిస్తున్న వ్యవస్థ ఒక్కసారిగా ఆగిపోయింది. ఇక మన ముందు మరో మార్గం లేదు. మన విధానాలను ఇక పునః సమీక్షించుకోవాల్సిందే. అలా అని విధానాలను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. వాటికి ఒక కొత్త దిశను అందించాలి. కొంత నిడివి, వెసులుబాటు కల్పించి, మనల్ని సంక్షోభం నుంచి గట్టెక్కించే దిశకు ఆ విధానాలు గమనాన్ని మార్చాలి. ఇప్పుడు అందరికి తెలియజేయాల్సిన అంశం ఇదే. కేంద్రీకృత ఆర్థిక విధానాల ద్వారా మన దేశంలో ఏం మార్పు జరిగింది అనేది వివరించడానికి ఒక రకమైన పద్ధతి అవసరమవుతుంది. అదే రీతిలో, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాల ద్వారా దేశంలో ఏం మార్పులు వస్తాయి అనేది చెప్పడానికి మీరు మరో పద్ధతి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏమీ తెలియనివాడిలా నాకు నేను ఇప్పుడు కొన్ని ఆలోచనలు చేస్తున్నాను. కానీ అంతకన్నా ఎక్కువ ఆలోచన అవసరం. మేం ఒక విధానాన్ని రూపొందించాం. దానిని మరో రూపం లేదా మరిన్ని రూపాలలో ప్రజల దగ్గరకు చేరవేయాలి. ఈ ప్రక్రియలో మాకున్న శక్తి, ఉండాల్సిన స్థాయిలో లేదు. ఆ విధానానికి అవసరమైన ప్రచారం అందించే సామర్థ్యం మాకు లేదు. ఈ విషయంలో మాకన్నా అనుభవమున్న నిపుణుల సహాయం మాకు చాలా అవసరం అనే విషయం చెప్పడానికి నేనేమీ సంకోచించడం లేదు.
మీకు విధానాల గురించి తెలుసు. మార్పులు తెలుసు; ఒకవేళ ఏదైనా విధానపరమైన అంశం కానీ, ఎంచుకున్న నూతన దృక్పథం కానీ, చేపట్టిన సంస్కరణ కానీ.. ఇలాంటి అంశాలలో ఏదైనా తెలియకున్నా, దానిని తెలుసుకోవడం మీకు అంత కష్టం కాదు; మేం మీతో కలిసి కూర్చుంటాం; ఈ విధానాలు ప్రజలకు చేరువయ్యే మార్గాలను కలిసి రూపొందిద్దాం. ఈ మొత్తం ప్రక్రియలో ఇదే నాకు చాలా కీలకం. ఆ దిశలో మరికొంత ప్రయత్నం, వాస్తవిక ప్రయత్నం చేయడానికి ఇంతకన్నా మంచి సమయం మరోటి లేదు. ఇక్కడ నాకు ముఖ్యమైనది ఈ నూతన అంతర్జాతీయ వ్యవస్థకు అనుగుణంగా మన దేశంలో మనం తీసుకున్న నూతన పంథా, సరికొత్త దిశాగమనం. దానిమీదనే నేను దృష్టి పెట్టదల్చుకున్నా. ఈ విషయంలో, మాకు మీ సహాయం చాలా అవసరం. ప్రభుత్వానికి సహాయం చేయాలని నేను మీ సంస్థను కోరుతున్నా. ఈ కొత్త విధానాలను భారత ప్రజలు అందరూ అర్థం చేసుకునేలా చేయడంలో మీ సహాయం అవసరం. ప్రజల నుంచి సరైన స్పందన లేని సందర్భాలు, వాళ్ల ఫీడ్బ్యాక్ సరిగ్గా లేని సందర్భాలలో మీ సహాయం చాలా అవసరం. నిజానికి ఇది టూ-వే ట్రాక్ లాంటిది. నేను అర్థం చేసుకున్నంతవరకు, ప్రజాసంబంధాల రంగంలో పనిచేసే వ్యక్తి కేవలం కమ్యూనికేటరే కాదు, ఒన్-వే కమ్యూనికేటర్ అంతకన్నా కాదు. ప్రజాసంబంధాలు రెండుపక్కలా, రెండువైపులా జరగాల్సిన ప్రయత్నం. ప్రభుత్వం ఇప్పటివరకు చేసినదానికి అదనంగా ఈ ప్రయత్నం చేయగలిగితే, అదొక గొప్ప ప్రయత్నమే.
దేశానికి గొప్ప మన సమైక్యతే గొప్ప వారసత్వం. మన దేశంలో కొన్ని శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న భిన్న సంస్కృతులు, ప్రభావాలు మనలను ఒక్కటిగా చేశాయి. ప్రజల మధ్య పరస్పర అవగాహన, అనుబంధం, ఏకతాభావన నెలకొన్నాయి. భిన్న సంస్కృతులు పరస్పరం ప్రభావితం కావడం వల్ల జాతీయ జీవనం మరింత సుసంపన్నం అయింది. కష్టాల్లోనైనా, సుఖాలలోనైనా దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలుస్తారు. దేశ ప్రజల మధ్య ఉద్వేగభరితమైన ఐక్యత నిరంతరం సాగుతూనే ఉన్నది. దీనిని కాపాడుకోవాలి. స్వార్థంతో, సంకుచితత్వంతో ప్రజల మధ్య విద్వేషాలు రగిలించే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి విభజన శక్తులకు తగు రీతిలో బదులివ్వాలి. ప్రభుత్వం, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పౌర సంఘాలు అన్ని ఈ కుట్రలను తిప్పికొట్టాలి.
(భారత సాంస్కృతిక సమగ్రతా కమిటీ దేశ సమైక్యతా కచేరీలు, ఊరేగింపులు నిర్వహిస్తున్న సందర్భంగా 1991 అక్టోబర్ 20న ప్రధాని పీవీ సందేశం)
జనాభా పెరగడం మూలంగా మనకున్న కొద్దిపాటి వనరులతో ప్రజల అందరి అవసరాలు తీర్చడం కష్టమవుతున్నది. ఆర్థికంగా ఎంత అభివృద్ధి చెందినా ఆ ఫలాలు ప్రజలకు చేరడం లేదు. ప్రత్యేకించి బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందడం లేదు. కోట్లాది మంది ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగా జనాభా నియంత్రణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. తాము జీవితంలో విజయం సాధించడానికి, జనాభా నియంత్రణకు సంబంధం ఉందనే అవగాహన ప్రజలకు కలిగించాలి. చిన్న కుటుంబమే సౌభాగ్యానికి నిలయమని వారికి తెలియచేయాలి. మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఈ సందేశం చేరాలి.
– ప్రధాని పీవీ నరసింహారావు (1991 జూలై 4, ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా..)