చండీగఢ్ : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి అనుమతి లభించనిపక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నెలలో పంజాబ్ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించింది.
అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లులను ఆమోదించి పంపినప్పటికీ రాష్ట్రపతికి పంపకుండా గవర్నర్ తనవద్దే పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. తమ బిల్లులకు రాష్ట్రపతి అనుమతి లభించేలా చూడాలని ఆయన గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
కేంద్రం తాను తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి రైతులతో కూర్చుని చర్చించి వాటి స్థానంలో కొత్త చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం నాలుగేండ్ల కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా కెప్టెన్ అమరీందర్సింగ్ మీడియాతో మాట్లాడారు.
రైతులు-అర్తిల మధ్య పాతకాలం నాటి బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదని అమరీందర్సింగ్ అన్నారు. కొత్త చట్టాలు ప్రస్తుత వ్యవస్థకు అంతగా సూట్కావని, వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని చెప్పారు.
గత మూడు నెలలుగా రైతులు దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నా కేంద్రం దృష్టికి రావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలకు పోతున్న మోదీ ప్రభుత్వం.. రైతులను నాశనం చేయడానికే కొత్త చట్టాలను తీసుకొచ్చినట్లు కనిపిస్తుందన్నారు.
కేంద్రం చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది అక్టోబర్లో నాలుగు బిల్లులను తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది. ఈ సవరణలు రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తాయని అమరీందర్ సింగ్ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేసిన కేంద్ర చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర చట్టాలు ఉన్నందున.. వీటికి రాష్ట్రపతి అనుమతి పొందవలసి ఉంటుంది. గతంలో తెచ్చిన బిల్లులు రాష్ట్రపతి వద్దకు చేరనందున..
మరోసారి సవరణ బిల్లులను తమ ప్రభుత్వం తీసుకువస్తుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో విధాన్సభలో అమరీందర్సింగ్ చెప్పారు.