‘స్త్రీనిధి’ ద్వారా మహిళల కుటుంబాలకు బీమా సౌకర్యం
స్వయం సహాయక సభ్యులకు సురక్ష(బీ) పథకం
మెదక్ జిల్లాలో 14,962 సంఘాలు
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 17 : రుణాలను అందిపుచ్చుకుని తమకాళ్లపై తాము నిలబడి చూపిస్తున్నారు ‘మహిళామణులు’. వారి ఆర్థిక స్వావలంబనకు అండగా నిలుస్తున్న స్త్రీనిధి సంస్థ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సురక్ష (బీ)తో స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ భరోసానిస్తున్నది. తక్కువ ప్రీమియంతో ఈ పథకంలో చేరే విధంగా సభ్యులకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సంఘంలోని సభ్యురాలు ఎలాంటి కారణంతోనైనా మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు సురక్ష (బీ) ద్వారా రూ.లక్ష పరిహారం అందించనున్నారు. మెదక్ జిల్లాలో 14,962 మహిళా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లోని మహిళా సభ్యులకు ఈ పథకం వర్తించనున్నది.
మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రుణాలిచ్చి బాసటగా నిలుస్తున్న స్త్రీనిధి సంస్థ మరో అడుగు ముందుకేసీ బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇప్పటి వరకు రుణాలు పొందిన మహిళలకే వర్తించే బీమా సౌకర్యాన్ని స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులందరికీ వర్తించేలా శ్రీకారం చుట్టింది. తక్కువ ప్రీమియంతో ఈ పథకంలో చేరే వీలు కల్పించింది. సభ్యురాలు మృతి చెందితే వారి కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లించేలా సురక్ష(బీ) పథకాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బీమా పథకంపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. అతివల సాధికారత కోసం పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. వీరికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి చిరు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల వైపు నడిపించేలా ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం ఇతరత అవసరాల కోసం మహిళా సభ్యులకు స్త్రీనిధి ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. ఇప్పటి వరకు రుణాలు పొందిన మహిళా సభ్యులకు మాత్రమే సురక్ష(ఏ) బీమా పథకం అమలు చేస్తున్నారు. గత నెల సురక్ష(బీ) పేరుతో కొత్త బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో సభ్యులందరికీ అవకాశం కల్పించారు.
అర్హతలు.. కావాల్సిన పత్రాలు
మహిళ సంఘాల్లో 18 నుంచి 60 ఏండ్ల లోపు గల సభ్యులు అర్హులు. వారి ఇష్టానుసారంగానే బీమా పథకం లో చేరవచ్చు. వయస్సు తెలియజేసే ఆధార్, ఓటరు కా ర్డు, విద్యార్హత సర్టిఫికెట్, పాన్కార్డు, పాస్పోర్టు లాంటి ఏదో ఒక గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసి సభ్యత్వం పొందవచ్చు. సంఘంలోని సభ్యుల తీర్మానం ప్రకారం బీమా పథకంలో చేరాలి. ఇందుకు సభ్యురాలు ఏటా రూ. 230 చొప్పున మూడు సంవత్సరాలు రూ. 690 చెల్లించాలి. నగదు అందుబాటులో లేనివారు స్త్రీనిధి నుంచి రుణంగా తీసుకోవచ్చు. రుణానికి వార్షిక వడ్డీ 11.50 శాతం ఉంటుంది.
ఈ నెల 23 వరకు అవకాశం
గత నెలలో బీమా పథకాన్ని అమల్లోకి వచ్చినా సాంకేతిక సమస్యలతో వెబ్సైట్ తెరచుకోలేదు. ఇటీవల ఈ సమస్య తీరడంతో సంబంధిత అధికారులు మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తూ సభ్యత్వాలు నమోదు చేయిస్తున్నారు. మార్చి 23 వరకు సురక్ష(బీ) బీమా పథకంలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏ కారణంతోనైనా(ఆత్మహత్య తప్ప) సభ్యురాలు మరణిస్తే రూ.లక్ష పరిహారం చెల్లిస్తారు. తీసుకున్న రుణం మాఫీ చేస్తారు. చెల్లించిన డబ్బులు తిరిగి ఇస్తారు. అంత్యక్రియల నిర్వహణకు రూ.5 వేలు సమాఖ్య నుంచి అందజేస్తారు.
జిల్లాలో 14,962 సంఘాలు
జిల్లాలో కొత్త, పాత సంఘాలు 14,962 ఉండగా వీటిలో 1.49 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారు. వీరంతా బీమాలో చేరవచ్చు. ఇందుకోసం సంఘాల ప్రతినిధులు మహిళా సభ్యులకు అవగాహన కల్పిస్తున్నారు.
బీమా చేసుకోవడానికి ముందుకొస్తున్నారు
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మహిళలను పేదరికం నుంచి గట్టెక్కించడమే లక్ష్యం. మహిళల పురోగతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. సంఘాల ఆర్థిక పురోగతితో పాటు సభ్యులకు భరోసా విషయాలపై అవగాహన కల్పిస్తున్నాం. సంఘాల సభ్యురాళ్లు బీమా చేసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు.
-సునీత, మెప్మా అధికారి