మెదక్ : పాత కక్షలు మనసులో పెట్టుకుని విద్యుత్ షాక్తో 5 పందులను హతమార్చిన సంఘటన నర్సాపూర్ రూరల్ మండలం మూసాపేట్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మూసాపేట్ గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ కర్నూలు ప్రాంతం నుంచి 30 పందులను తీసుకువచ్చి పెంచుతూ..జీవనోపాధి పొందుతున్నాడు.
ప్రతిరోజు సంగారెడ్డి ప్రాంతం నుంచి అన్నం తీసుకువచ్చి వాటికి వేస్తూ సాకుతున్నాడు. సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన తలారి శేఖర్ అనే వ్యక్తి పాత కక్షలను మనసులో పెట్టుకొని తనఇంటి ఆవరణంలో పందులను హతమార్చడానికి విద్యుత్ షాక్ ను ఏర్పాటు చేశాడు.
అటువైపుగా వచ్చిన ఐదు పందులు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితులు ఎరుకలి అశోక్ చనిపోయిన పందులను తీసుకెళ్లి వాటి మృతికి కారకుడైన తలారి శేఖర్ ఇంటి పక్కన గల పొలంలో వేసి నిరసన తెలిపాడు. గ్రామస్తులు, చిన్న పిల్లలు విద్యుత్ షాక్ తగిలి చనిపోతే పరిస్థితి ఏంటి అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తనకు న్యాయం చేయాలంటూ బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.