చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాట 234 స్ధానాలకు గాను 154 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవల కమల్ హాసన్ స్పష్టం చేశారు.
మిగిలిన 80 సీట్లను మిత్రపక్షాలకు కేటాయిస్తారు. ఎంఎన్ఎం భాగస్వామ్య పక్షాలైన ఏఐఎస్ఎంకే, ఐజేకే చెరో 40 స్ధానాల్లో బరిలోకి దిగనున్నాయి. ఇక బీజేపీతో జట్టుకట్టిన ఏఐఏడీఎంకే అధికారాన్ని నిలుపుకునేందుకు శ్రమిస్తుండగా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్ తోడ్పాటుతో అధికార పగ్గాలను చేపట్టేందుకు హోరాహోరీగా పోరాడుతోంది. తమిళనాట ఈసారి డీఎంకే కూటమి పాగా వేస్తుందని పలు ప్రీపోల్ సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే.