బ్యాంగ్కాక్: థాయ్ల్యాండ్లో ఆస్ట్రాజెన్కా టీకా పంపిణీని నిలిపివేశారు. ఆ టీకా తీసుకుంటే రక్తం గడ్డకడుతున్నట్లు ఆరోపణలు రావడంతో.. ఆస్ట్రాజెన్కా టీకా పంపిణీ ఆపేశారు. అయితే ఆ ఆరోపణలకు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి ఇవాళ థాయ్ల్యాండ్ ప్రధాని తొలి డోసు టీకా తీసుకోవాల్సి ఉంది. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. డెన్మార్క్, నార్వే లాంటి దేశాలు కూడా ఆస్ట్రాజెన్కా టీకా వినియోగాన్ని నిలిపివేశాయి. అయితే యూరోప్ దేశాల్లో సుమారు 50 లక్షల మంది ఇప్పటికే ఆస్ట్రాజెన్కా టీకా తీసుకున్నారు. అయితే సుమారు 30 కేసుల్లో థ్రాంబోఎంబోలిక్ లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. అంటే వారిలో రక్తం గడ్డకట్టే లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆస్ట్రాజెన్కా టీకా వల్లే రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొన్నది. టీకా వల్ల నష్టాల కన్నా లాభాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ ఏజెన్సీ పేర్కొన్నది. క్లినికల్ ట్రయల్స్ దశల్లో టీకా సేఫ్టీ గురించి స్టడీ చేసినట్లు ఆస్ట్రాజెన్కా చెప్పింది. ఆస్ట్రాజెన్కాకు చెందిన సుమారు లక్షన్నర డోసులు ఫిబ్రవరి 24వ తేదీన థాయ్ల్యాండ్కు వచ్చాయి. మరో రెండు లక్షల కరోనావాక్ డోసులు చైనా నుంచి థాయ్కు వచ్చాయి. ఆ దేశంలో ఇప్పటికే 30 వేల మందికి కరోనావాక్ టీకా ఇచ్చారు. కరోనావాక్ టీకా పంపిణీ కొనసాగించనున్నట్లు థాయ్ పేర్కొన్నది.