లక్నో: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్గా నిలిచింది. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్. ఆమె కంటే ముందు ఇంగ్లండ్ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ఇంతకుముందు అంతర్జాతీయ క్రికెట్లో 10 వేల పరుగులు చేసింది. ఆమె అన్ని ఫార్మాట్లు కలిపి 309 మ్యాచ్లలో ఈ ఫీట్ అందుకోగా.. మిథాలీ 311వ మ్యాచ్లో ఈ మార్క్ దాటింది. సౌతాఫ్రికాతో గురువారం లక్నోలో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో మిథాలీ ఈ రికార్డు అందుకున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.
ఎన్నో రికార్డులు
అంతకుముందే మిథాలీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన మహిళా ప్లేయర్గా నిలిచిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో ఆడినప్పుడే ఆమె ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ను అధిగమించింది. 1999లో ఐర్లాండ్పై మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. గత మంగళవారం సౌతాఫ్రికాపై తన 310వ మ్యాచ్ ఆడి ఈ రికార్డు సృష్టించింది. మొత్తం కెరీర్లో 10 టెస్టులు, 211 వన్డేలు, 82 టీ20లు ఆడింది మిథాలీ రాజ్. అంతకుముందు ఆ రికార్డు ఉన్న చార్లెట్ 2015లో క్రికెట్ నుంచి రిటైరైంది. ఆమె ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 191 వన్డేలు, 95 టీ20 ఆడింది. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు (6938), 200 వన్డేలకుపైగా ఆడిన తొలి ప్లేయర్, ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవకుండా వరుసగా అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్ (111 మ్యాచ్లు), టీ20ల్లో 2 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్ రికార్డులు కూడా మిథాలీ పేరిటే ఉన్నాయి.