తిరువనంతపురం : కేరళలో అధికార సీపీఐకి టూ టర్మ్ పాలసీ తలనొప్పిగా మారింది. రెండుసార్ల కన్నా ఎక్కువగా టిక్కెట్లు కేటాయించకూడదన్న నిబంధన ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు తలకు చుట్టుకున్నది. ఈ నిబంధనలను అడ్డం పెట్టుకుని 33 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు. మరి ఈ నిబంధన విజయన్కు ఎందుకు వర్తించదు అని టిక్కెట్లు కోల్పోయిన అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కేరళ సీపీఐ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
రెండుసార్ల కన్నా ఎక్కువ అసెంబ్లీలో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఇవ్వకూడదని కేరళలోని సీపీఐ పార్టీ నిర్ణయం పెట్టుకున్నది. దీని మేరకు 33 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టిక్కెట్లు నిరాకరించింది. వీరిలో ఐదుగురు మంత్రులు కూడా ఉన్నారు. 83 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను సీపీఎం పార్టీ బుధవారం విడుదల చేసింది. జాబితాలో తమ పేర్లు లేవని 30 మందికి పైగా సిట్టింగ్లు అయోమయానికి గురయ్యారు. ఇదేంటని అధిష్ఠానాన్ని ప్రశ్నించగా.. టూ టర్మ్ పాలసీని పాటిస్తున్నట్లు సమాధానం వచ్చింది. దాంతో వారు పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పట్ల ఓ తీరుగా, ముఖ్యమంత్రి విజయన్ విషయంలో మరో తీరుగా వ్యవహరించడం పట్ల వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 1970 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పినరాయి విజయన్కు ఎలా టిక్కెట్ కేటాయిస్తారని వారు పార్టీని కడిగిపారేశారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత సీపీఐ సీనియర్ నాయకులు, ఆర్థిక మంత్రి టీఎం థామస్ ఐజాక్ సహా మంత్రులు ఏకే బాలన్, జీ సుధాకరన్ వంటి వారికి టిక్కెట్లు నిరాకరించడంతో ఇకపై వారు కేరళ రాజకీయాల్లో బరిలో ఉండరు. ఐజాక్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో సుధాకరన్ మూడుసార్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు. బాలన్ కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు.
తన గుప్పిట్లో పెట్టుకునేందుకేనా..?
పార్టీని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునేందుకే పినరాయి విజయన్.. టూ టర్మ్ పాలసీని తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తున్నది. తనకు, పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని గత కొంతకాలంగా వీరిపై ముద్రవేస్తూ వచ్చిన విజయన్.. చివరక వారికి టిక్కెట్లు ఇవ్వకుండా చక్రం తిప్పగలిగారు. దాదాపు 30 మంది సిట్టింగ్లకు టిక్కెట్లు కేటాయించకుండా.. తన అనుచరులకు ఇప్పించుకుని పార్టీని పూర్తిగా తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నారన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. గతంలో తనను ప్రశ్నించినందుకే వీరిపై తన కక్ష తీర్చుకోవడంతోపాటు పార్టీని హైజాక్ చేయడంలో విజయం సాధించారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ప్రభాస్ అభిప్రాయపడుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు 83 మందిని నిలిపిన సీపీఐ.. 9 మంది స్వతంత్రులకు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించింది. ముస్లింల ఓట్లను గంప గుత్తాగా పొందేందుకు తమ తొలి జాబితాలో 17 మంది ముస్లింలకు సీపీఐ సీట్లు కేటాయించింది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్.. కూనూర్ జిల్లాలోని ధర్మదం నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. 2016 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి విజయన్ 36 వేల పైచిలుకు ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి మాంబరం దినకరన్పై గెలుపొందారు. 1970లో కుతుపరంబా నుంచి బరిలో నిలిచి విజయం సాధించిన విజయన్.. 1977, 1991 లో కూడా ఇదే స్థానం నుంచి గెలుపొందారు. 1996 ఎన్నికల్లో పయ్యనూర్ నుంచి, 2016 లో ధర్మదం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
డూ అండ్ డై కోసమే ఇలా..
సిపిఐ ప్రకటించిన 83 మంది అభ్యర్థులలో 48 మంది అభ్యర్థులు డిగ్రీ హోల్డర్లు ఉండగా.. ఇద్దరు పీహెచ్డీ, ఇద్దరు ఎంబీబీఎస్, 14 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 22 మంది లా డిగ్రీ హోల్డర్లు ఉన్నారు. అదే సమయంలో, నలుగురు అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల కన్నా తక్కువగా.. 31-41 సంవత్సరాల మధ్య వయసున్న వారు 8 మంది, 41-51 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 13 మంది, 51-61 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 33 మంది ఉండగా.. మిగిలిన వారు 61 ఏండ్ల పైబడిన వారు ఉన్నారు.
ఈ జాబితాలో మంత్రులు కేకే షాలెజా, జే మార్సికుట్టి అమ్మతోపాటు 12 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించారు. 75 ఏండ్ల ముఖ్యమంత్రి పినయాయి విజయన్ ఈ జాబితాలో అతి పెద్ద వయసున్న వ్యక్తి కాగా.. 27 ఏళ్ల ఎస్ఎఫ్ఐ నాయకుడు సచిన్ దేవ్ అతి పిన్న వయస్కుడు కావడం విశేషం.