న్యూఢిల్లీ: భారత ఓపెనర్ పృథ్వీ షా (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు విజయ్ హజారే టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. సమర్థ్ వ్యాస్ (90 నాటౌట్), చిరాగ్ జానీ (53 నాటౌట్), విశ్వరాజ్ జడేజా (53) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో పృథ్వీ షాతో పాటు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (75) మెరువడంతో ముంబై 41.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 285 పరుగులు చేసింది. మరో క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ 46 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. గురువారం జరుగనున్న సెమీఫైనల్స్లో గుజరాత్తో ఉత్తరప్రదేశ్.. కర్ణాటకతో ముంబై తలపడనున్నాయి.
Prithvi Shaw’s 185 powers Mumbai into Vijay Hazare Trophy semi-final