లింగాష్టకం శివుని రూపానికి పూజలు ఉండవు. శివలింగానికి మాత్రమే ఉంటాయి. లింగపూజ ఎంతో భక్తిగా, విశేషంగా ప్రతిరోజూ నిర్వహిస్తారు. ఈ లింగభావనకు మూలం ఏమిటో అర్థం కాక పెద్ద పెద్దవాళ్లే ఇబ్బందులు పడి వ్యతిరేక వ్యాఖ్యానాలు కూడా చేసుకుంటూ వచ్చారు. మూలం అర్థమైనా, కాకున్నా నిత్యోత్సవంగా శివలింగాన్ని ఆరాధించే క్రమాన్ని మాత్రం భారతీయులు వదలలేదు. ఈ శివుడే మంగళాన్ని కలిగిస్తాడని, శాంతిని పెంచుతాడని, వైవాహిక సౌఖ్యాన్ని అందిస్తాడని, ఆరోగ్యప్రదుడని, అకాల మృత్యువును దరి చేరనీయడని, సకల ఐశ్వర్యాలనూ అందిస్తాడని, అనవసర కోరికలను పరిహరిస్తాడని- ఇలా ఎన్నో భావనలతో పూజిస్తుంటారు. భారతీయ దైవాలన్నీ ఖగోళ-భూగోళ ప్రకృతికి ప్రతీకలే. అన్నీ వైజ్ఞానిక విశేషాలే. ఈ వరుసలో శివలింగం మనం నివసించే భూగోళానికి ప్రతీక. చంద్రశేఖరుడు శివుడు. భూమికి ఉపగ్రహం చంద్రుడు. గంగాధరుడు శివుడు. భూమిపైనా మూడింట రెండువంతులు జలం ఉంటుంది. శివుడు దిగంబరుడు. భూమి కూడా ఆకాశంలో దిక్కులే అంబరంగా తిరుగుతుంది. శివుడు లింగస్వరూపుడైతే భూమి ఆకారం గోళాకృతి. మహాకాలుడు శివుడు. భూమ్మీద ఉన్నవారికి కాలం అనేది భూమి ఆత్మభ్రమణ, పరిభ్రమణ కాలాల వల్లనే తెలుస్తుంది. లయకారకుడు శివుడు భూమిపైన జీవులు మరణిస్తే భూమిలోనే లయం కావలసిందే. విభూతి ధారణ శివుని ధర్మం. భూమ్మీద ఉండేది మట్టి మాత్రమే. పార్వతికి భర్త శివుడు. భూమి చుట్టూ ఉండే ఓజోన్ పొర లోపలి పాంచభౌతిక ప్రకృతికి పార్వతి ప్రతీక. శివుడు అర్ధ నారీశ్వరుడు. ప్రకృతి, భూమి సంగమం వల్లనే ఈ సృష్టి ఏర్పడుతుంది. అందుకే, రెండూ కలిసి మాత్రమే ఉంటాయి. గణపతికి తండ్రి ఆయన. భూమిలోని గురుత్వాకర్షణ శక్తి గణపతి. కుమార జనకుడు శివుడు. భూమి చుట్టూ ఉండే విద్యుదయస్కాంత రూపమైన సర్పశక్తికి కుమారస్వామి ప్రతీక. ఇవే శివుని మెడలోని సర్పాలు కూడా. అభిషేక ప్రియుడు శివుడు. భూమిపైన కురిసే వర్షమే మనకు ఆహారాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే, శివలింగానికి నిరంతరం అభిషేకం చేస్తూ వర్షాలు కురవాలనే భావాన్ని ప్రకటిస్తాం. ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. భౌతికమైన అన్నిరకాల సంపదలూ (పెట్రోల్, సహజవాయువు, బొగ్గు, వజ్రాలు, గ్రానైట్, నీరు వంటివన్నీ) భూమిపైన,లోపలా ఉన్నాయి. అందుకే ‘సర్వ సముద్భవ కారణ లింగం’ అని నమస్కరిస్తున్నాం. ఇలా శివలింగం ఎన్నో అంశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. శివపూజలో శివలింగంపై బిల్వదళాలు, తులసీదళాలు పెట్టి పూజించే సంప్రదాయం ఉంది. దీని అర్థం భూమిపై చాలా విరివిగా బిల్వవృక్షాలు, తులసీ వృక్షాలు పెంచి పోషించాలని! ఆ వృక్షాలు అధికమైన చోట కాలుష్యాలన్నీ నియంత్రితమై ఆనందంగా అందరూ జీవిస్తారని! ఈ విధంగా ప్రతీకలుగా ఉన్న అంశాలను పూజా విధానంలో చేర్చి చూపే సంప్రదాయం భారతీయులకు మాత్రమే ఉంది. తెలిసినా తెలియకున్నా ఈ మార్గాన్ని భారతీయులు వదలకుండా నిర్వహిస్తున్నారు. వైజ్ఞానికంగా అర్థం చేసుకొని, ఇంకా భక్తి భావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తమకు ఎన్నో రూపాల్లో సంతోషాన్నిచ్చే ఈ భూమి పుట్టిన కాలాన్నే ‘లింగోద్భవ’ కాలంగా గుర్తించి, ఆ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా లోకానికి మరింత మేలు, మానవాళికి మరింతగా ఆనందం కలగాలని, కోరుకుంటూ చేయాల్సిన కృతజ్ఞతా సంబంధ పూజా విధానాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే, లింగోద్భవ కాలంలో భూగోళరూప శివుని మరింత భక్తి శ్రద్ధలతో ఆరాధిద్దాం. సాగి కమలాకర శర్మ