అపురూపమైనదమ్మ ఆడజన్మ.. ఆ జన్మకు పరిపూర్ణత ఉండాలమ్మ..అన్నాడో సినీకవి. స్త్రీ గొప్పతనం, సహనం గురించి ఎంతో విశిష్టంగా పాటరూపంలో విశదీకరించారు. అవును నిజమే..అతివ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలో ముందస్తు వేడుకలు జరిగాయి. శనివారం మాదాపూర్ హైటెక్స్లో ఉమెన్ బిజినెస్ ఎక్స్పో ప్రారంభమైంది. ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని గురుకులంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
వెలుగులు పూస్తావు వెళ్లే దారంత…” అంటూ.. స్త్రీ గొప్పతనాన్ని ఘనంగా చాటి చెప్పాడో సినీ కవి… అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న ‘ఆమె’కు వందనం అంటున్నది నగరం. అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా.. ఆత్మీయతతో అనురాగాన్ని పంచే..అమృతమూర్తికి పాదాభివందనం చేస్తున్నది. సోమవారం జరిగే ఉమెన్స్ డే వేడుకలకు సిటీలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ముందస్తుగానే ప్రత్యేక కార్యక్రమాలు మొదలయ్యాయి. సంబురాలు అంబరాన్నంటాయి. హైటెక్స్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎక్స్పో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్నది.
మేడ్చల్, మార్చి 6 నమస్తే తెలంగాణ, ఘట్కేసర్ రూరల్: ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు ప్రధాన ఆయుధమని, ఎలాంటి పరిస్థితిల్లో కూడా ధైర్యం కోల్పోవద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. రాష్ర్టాన్ని ముందుకు తీసుకువెళ్లేది మహిళలేనన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అంకుషాపూర్లోని తెలంగాణ సాంఘిక, సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ, లా కళాశాలలో శనివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బాలికల చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకులాలతో పాటు విదేశీ విద్యకు తోడ్పాటునందిస్తున్నదన్నారు. మహిళల విద్య కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో త్వరలోనే షార్ట్ ఫిల్మ్ను రూపొందిస్తామని వెల్లడించారు.
అఘాయిత్యాలను అడ్డుకోవడంతో పాటు ఆత్మరక్షణకు తీసుకునే జాగ్రత్తలపై ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా అవగాహన కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి చామకూర మల్లారెడ్డి చెప్పారు. ఈ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత, మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర భద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ పావని జంగయ్య యాదవ్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, మార్చి 6: ఘట్కేసర్ మండలంలోని అవుషాపూర్ గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న అవుషాపూర్ ఫుడ్స్ను శనివారం ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, స్థానిక సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ): మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు హెచ్ఎంఆర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో రైలులో సుమారు 65 మంది లోకో పైలెట్లు ఉన్నారు. ఇందులో పనిచేస్తున్న మహిళలంతా అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారు. వారితో కలిసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇరవై మూడేండ్ల గోవు సుశ్రుత బీటెక్ పూర్తి చేసి.. మెట్రో రైలు లోకో పైలెట్గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి ఆమె నాగోల్-రాయదుర్గం మార్గంలో రైలును నడుపుతున్నారు. తనతో పాటే పనిచేసే వారందరిలో కంటే మంచి ప్రతిభను కనబర్చినట్లు అధికారులు గుర్తించారు.
ఎల్ అండ్ టీ మెట్రోలో ఉద్యోగం వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు చాలా సంతోష పడ్డారు. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నాతోపాటు పనిచేస్తున్న మహిళా లోకో పైలెట్లతో కలిసి పనిచేయడం, ప్రతి నిత్యం ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేయడం ఆనందంగా ఉంది. హెచ్ఎంఆర్లో పనిచేయడం నేను గర్వంగా భావిస్తున్నా. -సుశ్రుత, మెట్రో లోకో పైలెట్
సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ ) : మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీఏలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా సిబ్బందే సేవలందిస్తారు. లెర్నింగ్, లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ తదితర పనుల మీద వచ్చే మహిళలలు అందరితో పాటు క్యూలైన్లో నిల్చోకుండా.. ఈ సౌకర్యం కల్పించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో గ్రేటర్ వ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని హైదరాబాద్ జేటీసీ పాండురంగానాయక్ తెలిపారు.
శేరిలింగంపల్లి, మార్చి 6ః మహిళలను ప్రోత్సహించి చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధ్ది శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం జరిగిన హైబిజ్ టీవీ ఉమెన్స్ లీడర్ షిప్ అవార్డ్స్-2021 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన మహిళలకు ఆయన అవార్డులు అందజేశారు. భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి , శాంతాబయోటెక్ చైర్మన్ వరప్రసాద్రెడ్డి, హైబిజ్ టీవీ ఏండీ రాజ్గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్ధరాత్రి ఆడపిల్ల
ఒంటరిగా వెళ్లగలుగు
తరుణ మేతెంచినప్పుడు
దేశానికి నిక్కముగా
స్వాతంత్య్రం వచ్చెననెను
జాతిపిత గాంధీజీ..!
కాలేజీ అమ్మాయిలు
విధులకెల్లు ఆడువారు
స్కూళ్లకెళ్ల్లు బాలికలను
మానవతను మంటగలిపి
నీచమైన కామెంట్లతో
హీనమైన చేష్టలతో
బాధించే పోకిరీలు
వీధుల్లో మస్తున్నరు!
స్త్రీ విద్యకు ఆటంకం
పురోగతికి అడ్డుపడే
ఈ నీచుల నరికట్టుట
ధ్యేయంగా లక్ష్యంగా
మహిళా సంఘాలతో
సదస్సుల్ని నిర్వహించి
సమస్యల్ని చర్చించాం..
సూచనలకు అనుగుణంగా..
స్టేషన్లను నిర్మించాం..
స్టేషనంత, ట్రైనంతా
నిఘానేత్ర వీక్షణతో
రక్షిత నిలయం చేసాం..!
పడుతుల పరిరక్షణకై
ప్రత్యేకపు ఏర్పాట్లలో
మూడింటిలో ఒక బోగీ
ముదితలదని ప్రకటించాం..!
మధురానగరను స్టేషను
మహిళలకే అంకితమని
తరుణి యనే పేరుపెట్టి
యాజమాన్య హక్కులను
స్త్రీజాతికి అర్పించాం..!
మహిళామణులెందరినో
పైలట్లుగ తీర్చిదిద్ది
యాజమాన్య పదువులకై
శిక్షణలను ఇప్పించీ
నిర్వాహక బాధ్యతలను
నిభాయించు అవకాశం
మెట్రోలో కల్పించాం..!!