న్యూఢిల్లీ : దేశంలో తొలిసారిగా టీకా డ్రైవ్లో ఒకే రోజు 1.3 మిలియన్లకుపైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 13,88,170 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం చెప్పింది. డ్రైవ్లో భాగంగా 48వ రోజు 13.88లక్షల మందికి, ఇప్పటి వరకు మొత్తం 1,80,05,503 మందికి టీకాలు వేసినట్లు పేర్కొంది. ఇందులో 68.38 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 60.22 లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్స్ మొదటి మోతాదును పొందగా.. 30.82లక్షల మంది హెల్త్కేర్ వర్కర్స్, 54,177 మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు రెండో మోతాదు ఇచ్చినట్లు వివరించింది. దేశంలో జనవరి 16న దేశంలో టీకాల పంపిణీ మొదలైన విషయం తెలిసిందే. మొదట ఫ్రంట్లైన్ వారియర్స్కు ప్రాధాన్యం ఇవ్వగా.. రెండో విడతలో 60 ఏళ్లు పైబడి, 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కేంద్రం టీకాలు వేస్తోంది. ఇప్పటి వరకు 60 ఏళ్లు పైబడిన 14.95 లక్షలు, 45 ఏళ్లు పైబడిన 2.18 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.
ఎన్నికల కమిషన్ అధికారులు, సిబ్బందికి టీకాలు వేసే ప్రక్రియను ప్రారంభించింది. మాజీ ముఖ్య ఎన్నికల కమిషన్ ఎంఎస్ గిల్ మొదట వ్యాక్సిన్ తీసుకున్నారు. అధికారులు, సిబ్బంది అందరికీ టీకాలు వేసిన అనంతరం ముఖ్య ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్లు సునీల్ చంద్ర, రాజీవ్కుమార్ టీకా వేసుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధి నిర్వహణలో పాల్గొనే సిబ్బంది అంతా ఫ్రంట్లైన్ వర్కర్లేనని ఈసీ పేర్కొంది.