టీబీజీకేఎస్ విజ్ఞప్తికి సానుకూల స్పందన
సింగరేణి ఉద్యోగుల విరమణ వయసు పెంచే అవకాశం!
గోదావరిఖని, జూలై 17: సింగరేణి ఉద్యోగులు, కార్మికుల విరమణ వయసు పెంపుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగుల తరహాలోనే రిటైర్మెంట్ వయసును 61 ఏండ్లకు పెంచాలని గురువారం సీఎం కేసీఆర్ను సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు కలిసి చేసిన విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని యూనియన్ నేతలు పేర్కొన్నారు. ప్రస్తుతం సింగరేణిలో రిటైర్మెంట్ వయో పరిమితి 60 ఏళ్లు ఉన్నది. అయితే ఎన్నికల హామీని నెరవేరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణిలోనూ ఇదే విధానాన్ని వర్తింపజేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు టీబీజీకేఎస్ నాయకులు బీ వెంకట్రావ్, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గురువారం రాత్రి ప్రగతిభవన్లో సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నట్లు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గతంలోనూ సింగరేణి కార్మికుల సర్వీసు నిబంధనలు సవరించి విరమణ వయసును టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆమె ఉన్నతాధికారులతో మాట్లాడడంతో పాటు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ను ఇప్పించిందన్నారు. కచ్చితంగా సానుకూల నిర్ణయం వస్తుందన్నారు. ఈ నెలలో సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఉన్నదని, ఈలోగా సీఎం ఆదేశాలు జారీ చేస్తే బోర్డు సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు.
పెంపుతో బహుళ ప్రయోజనాలు..
విరమణ వయసు పెంపుతో సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయిన కార్మికుడి వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు సంవత్సరాల ముందుగానే దిగిపోవాల్సి ఉంది. కార్మికుల రిటైర్మెంట్ 60గా ఉన్న 58 ఏళ్లకే మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ అయితే వారసులకు ఉద్యోగం లభిస్తోంది. విరమణ వయసు 61కి పెంచితే మెడికల్ బోర్డు ద్వారా దిగిపోయే వయస్సు 59 గా ఉంటుంది. దీంతో ఇప్పటికే అనర్హతతో ఉన్న వారు తిరిగి అర్హత సాధించే అవకాశం కలుగుతుంది. ఇప్పుడు కేవలం ఏడాదికి పైగా సర్వీసు ఉన్న వారు రెండు సంవత్సరాలకు పైగా సర్వీసు అర్హత సాధించి మెడికల్ బోర్డుకు ధరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న కార్మికులు మరికొంత కాలం విధులు నిర్వర్తించే అవకాశం దక్కుతుంది.