హరితహారంపై అవగాహనకే సైక్లోథాన్
కలెక్టర్ శశాంక
అంబేద్కర్ స్టేడియం నుంచి ర్యాలీ
డిప్యూటీ మేయర్ స్వరూపారాణితో కలిసి ప్రారంభించిన పాలానాధికారి
కార్పొరేషన్, జూలై 17: ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని కరీంనగర్ కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. నగరవాసులు తప్పనిసరిగా హరితహారంలో భాగస్వాములు కావాలని కోరారు. తెలంగాణకు హరితహారంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం సైక్లోథాన్ (సైక్లింగ్ ర్యాలీ) నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియం వద్ద డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణీ హరిశంకర్, బల్దియా కమిషనర్ క్రాంతితో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అక్కడి నుంచి కలెక్టరేట్, తెలంగాణ చౌక్, మంకమ్మతోట మీదుగా పద్మనగర్లోని బుల్ సెమన్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ నగరంలో గ్రీన్ బెల్ట్ పెంపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలో 10 ప్రాంతాల్లో ప్లాంటేషన్ పద్ధతుల్లో ప్రకృతి వనాలను రక్షించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. పంపిణీ చేస్తున్న మొక్కలను ఇండ్ల పరిసరాల్లో నాటి సంరక్షించాలని సూచించారు. ప్రతి వ్యక్తికీ స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని పంచేవి మొక్కలు మాత్రమేనన్నారు. కరీంనగర్లో ఒక శాతం మాత్రమే వనాలు ఉన్నాయని వీటిని పెంచాల్సినా అవసరం ఉందన్నారు.
సైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని నివారించడంతో పాటుగా శారీరక ధారుడ్యం పెంచుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలన్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధాన రహదారుల్లో ప్రతి రోజు కొన్ని గంటలు కేవలం సైక్లింగ్ చేసే వారికి అనుమతించే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నగర మేయర్ వై సునీల్రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొప్ప కార్యక్రమం హరితహారం అన్నారు. మియవాకీ పద్ధ్దతిలో నగరంలో 11 ఏరియాల్లో ఒకేచోట 40వేల మొక్కలు నాటి చిట్టడవులు సృష్టిస్తామని పేర్కొన్నారు. ఈ మహోద్యమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మయాంక్, కార్పొరేటర్లు తోట రాములు, గుగ్గిళ్ల జయశ్రీ, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి, సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, వ్యవసాయ మా ర్కెట్కమిటీ అధికారి పద్మావతి, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.