సిరిసిల్ల జిల్లాలో జలం పుష్కలం
కాళేశ్వరంతో ఎర్రటి ఎండల్లోనే జలకళ
ఇటీవలి వర్షాలతో పరవళ్లు
మత్తడి దుంకుతున్న ఎగువ మానేరు
దిగువన జాలువారుతున్న చెక్డ్యాంలు
నిండుకుండలా మధ్యమానేరు
ఆనందంలో ఆయకట్టు రైతులు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
సిరిసిల్ల/బోయినపల్లి/గంభీరావుపేట, జూలై 16:కాళేశ్వరం జలధారలు.. ఇటీవలి వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా జలకళలాడుతున్నది. ఎర్రటి ఎండల్లోనే నిండుకుండల్లా మారిన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు.. తాజా వానలతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువమానేరు మత్తడి దుంకుతుండగా, దిగువన పరుగులతో కొత్తగా నిర్మించిన చెక్డ్యాంలు జలపాతాల్లా జాలువారుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా వస్తున్న జలాలను చూసి ఆయకట్టు రైతులు ఆనందపడుతున్నారు. మానేరు వాగును సజీవనదిగా మార్చాలన్న రామన్న కల నెరవేరిందని సంతోషపడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
గట్టి వాన లేదు.. కుండపోత పోసింది లేదు.. కానీ, ఉమ్మడి జిల్లాలో జలసవ్వడి వినిపిస్తున్నది. కాళేశ్వర జలాలతో ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండల్లా మారగా, ఇప్పుడు తొలకరి వానలతో పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతుండగా, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు భూగర్భజలాలు పైపైకి చేరి, వ్యవసాయ బావుల్లో నీళ్లు చేతికందుతున్నాయి.
నాడు చుక్కనీరు లేక ఆగమైన రాజన్న సిరిసిల్ల జిల్లా, నేడు జలసవ్వడులు చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు వాటర్ జంక్షన్లా మారి, నలువైపులా జలధారలతో కళకళలాడుతున్నది. కాళేశ్వరం ఎత్తిపోతలతో శ్రీరాజరాజేశ్వర జలాశయంతోపాటు ఎగువమానేరు, చెరువులు మండుటెండల్లోనే నిండుకుండల్లా మారాయి. గత మేలో ఎగువమానేరు మత్తడి కూడా దూకింది. తాజాగా మళ్లీ కాళేశ్వర జలాలు, వర్షాలతో మధ్యమానేరు 24 టీఎంసీలతో నిండుకుండలా మారగా, అటు కామారెడ్డి జిల్లా పాల్వంచ, సిద్దిపేట జిల్లా కూడవెళ్లి వాగు ద్వారా వరద నీరు రావడంతో ఎగువమానేరు మత్తడి దుంకుతున్నది. ఈ రెండే కాదు జిల్లాలో ఏ జలవనరు చూసినా నీటితో కళకళలాడుతున్నది. కాగా, మత్తడి దుంకుతూ కనువిందు చేస్తున్న ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద పర్యాటకులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రమాదాలకు తావు లేకుండా ప్రాజెక్టు వద్ద బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి-సింగారం, కొండాపూర్-నారాయణపూర్, పదిర వద్ద మానేరుపై నిర్మించిన చెక్డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి.
చెక్ డ్యాంలకు జల సిరులు..
ఎగువ మానేరు పరవళ్లతో దిగువన గల వాగులపై ఇటీవల నిర్మించిన చెక్ డ్యాంలు నీటితో నిండిపోయాయి. మూడు నెలల్లోనే మానేరును సజీవ నదిగా మార్చుతానని మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నేడు నెరవేరింది. రెండ్రోజుల నుంచి నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నందున వాగు గుండా దిగువకు నీరు ప్రవహిస్తూ ఎగువమానేరు నుంచి సిరిసిల్ల జిల్లా కేంద్రం దాకా పూర్తయిన ఐదు చెక్డ్యాంలు జలకళను సంతరించుకొని దిగువకు ఉరకలు వేస్తూ శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) జలాశయంలోకి వస్తున్నాయి. మొన్నటిదాకా చుక్క నీరు లేని మానేర్వాగులో కనుచూపు మేర నీళ్లే కనిపిస్తున్నాయి. మానేరు వాగు జీవనదిలా మారిందని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో తొలిసారిగా చెక్డ్యాంలు నిర్మించి మత్తడులు దూకుతున్నాయని సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మానేర్ వాగును సజీవనదిగా మార్చేందుకు సంకల్పించిన మంత్రి కేటీఆర్ కల నేరవేరిందని భావిస్తున్నారు.
నిండుకుండలా ‘ఎస్సారార్’..
బోయినపల్లి మండలం మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర (మిడ్మానేరు) రిజర్వాయర్ నిండుకుండలా మారింది. అటు మానేరు పరవళ్లు.. ఇటు కాళేశ్వరం జలాల రాకతో ప్రాజెక్టులో నీటి నిల్వ క్రమంగా పెరుగుతున్నది. 5,555 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, మొత్తం 27.5 టీఎంసీలకుగాను శుక్రవారం సాయంత్రానికి 24.23 టీఎంసీలకు చేరింది. దీంతో శాభాష్పల్లి నాలుగు వరుసల వంతెన మీదుగా వెళ్లే ప్రయాణికులు పై నుంచి నీటిని చూస్తూ సంతోష పడుతున్నారు. మరి కొందరైతే సెల్ఫీలు దిగుతున్నారు.
బహుముఖ వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తున్న సర్కారు, అందుకు అనుగుణంగా జిల్లాల్లో వైద్య సేవలను పెంచుతున్నది. ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల్లో మాత్రమే చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఇప్పుడు గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలోనూ ఏర్పాటు చేసింది. అత్యాధునికమైన యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. గంటలోనే 300 వరకు పరీక్షలు చేసే సామర్థ్యముండగా, త్వరలోనే ప్రారంభించే అవకాశమున్నది.