రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్
రూ.10 లక్షల విలువైన వైద్య పరికరాలు అందించిన ‘టెమెనోస్’
సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 15: ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు సహాయాన్ని అందించే కార్పొరేట్ సంస్థలకు స్వాగతం పలుకుతామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సంస్థ టెమెనోస్ ఆధ్వర్యంలో జిల్లా దవాఖానకు రూ.10 లక్షల విలువైన వైద్య పరికరాలు సమకూర్చగా, గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వాటిని వైద్యాధికారి సుమన్మోహన్రావుకు కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానకు లక్షల రూపాయలు విలువ చేసే కరోనా సంబంధిత వైద్య సామగ్రిని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన టెమెనోస్కు కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ రిలీఫ్ సపోర్ట్ చర్యల్లో భాగంగా తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ చొరవతో టెమెనోస్ ఈ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు టీఎఫ్ఎంసీ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ మాథాల తెలిపారు. మరిన్ని సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాలను టీఎఫ్ఎంసీ దత్తత తీసుకోవాలనుకుంటున్నదని, రాబోయే రోజుల్లో చేనేత కుటుంబాలకు చేయూత ఇవ్వనున్నామని వెల్లడించారు. కాగా, కొవిడ్ వైద్య సామగ్రి సిరిసిల్లలో చాలా అవసరం ఉన్నందున తాము ఈ దవాఖానను ఎంచుకున్నట్లు టెమెనోస్ ఓ ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమంలో టీఎఫ్ఎంసీ సంస్థ అధ్యక్షుడి సత్యనారాయణ మాథాలతో పాటు టెమెనోస్ సంస్థ ప్రతినిధులు, సేతురాజ్ రాజారామ్, పూజిత కొండపాక, టీఎఫ్ఎంసీ చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీనివాసరావు తండా, ప్రోగ్రాం ఆఫీసర్ మీనాక్షి పాల్గొన్నారు.