గోదావరిఖని, జూన్ 13: రాష్ట్రంలోని అన్ని రంగాలకు సీఎం కేసీఆర్ ప్రోత్సహం అందిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఇటీవల బైజూస్ ఎడ్యుకేషన్ యాప్ నిర్వహించిన ఇంటర్నేషనల్ క్విజ్ కాంపిటేషన్లో ప్రతిభ చూపిన గోదావరిఖని విఠల్నగర్కు చెందిన కల్వల రోషన్ను తన నివాసంలో ఎమ్మెల్యే అభినందించారు. పోటీల్లో రోషన్ నూరు శాతం మార్కులతో మొదటి ర్యాంకు సాధించాడు. పారిశ్రామిక ప్రాంతంలో ఎందరో లిటిల్ జీనియస్, ఆణిముత్యాలు ఉన్నారని ఎమ్మెల్యే వివరించారు. విద్యార్థుల్లోని ప్రతిభకు మరింత పదును పెట్టేందుకు అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామన్నారు. రోషన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కళాకారులకు పుట్టినిల్లు ..
కళకు, కళాకారులకు పుట్టినిల్లు రామగుండం నియోజక వర్గమని ఎమ్మెల్యే అన్నారు. తన నివాసంలో ‘మదిలోని ధ్యానం నీకై ఆరాటం’ అనే ఫోక్ సాంగ్ను చందర్ ఆవిష్కరించారు. పాలకుర్తి మండలానికి చెందిన కళాకారులు రూపొందించిన ఫోక్ సాంగ్ విజయవంతంగా సాగాలన్నారు. ఇక్కడ రంజిత్ సాయి, అజయ్, కోటేశ్, భరత్ ఉన్నారు. అలాగే అక్షయ సమర్పించు బోడకుంట ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ‘గండర గండర బాయి గానపోళ్ల చిన్నది’ వీడియో సాంగ్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ పాటలో నటించి, ప్రతిభ చూపిన చిన్నారులు ఇండ్ల పృథ్వీ, మానసను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో గోదావరిఖని కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య, రామగుండం కళాకారుల సంఘం అధ్యక్షుడు మేజిక్ రాజా, బోడకుంట వెంకటరాజం, చంద్రపాల్, సిరిపురం శ్రీనివాస్, అంజయ్య ఉన్నారు.