రమణ చేరికను స్వాగతిస్తున్నాం
టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్
సిరిసిల్ల టౌన్, జూలై 12: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూస్థాపితమైందని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్ అన్నారు. రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావుతో కలిసి సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్లోకి చేరడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో 14 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పని చేశానని గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధనను కాంక్షిస్తూ తాము ఆనాడు పార్టీలో చేరామని, ఇదే క్రమంలో రాష్ర్టాభివృద్ధిని కోరుతూ నేడు రమణ పార్టీలో చేరారన్నారు. పద్మశాలీ సామాజికవర్గ సమస్యలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. డయింగ్ పరిశ్రమపై అప్పటి కేంద్ర ప్రభుత్వం విధించిన పన్నులను తొలగించడంలో సిరిసిల్ల నేతన్నలు చేసిన పోరాటానికి రమణ విశేష కృషి చేశారన్నారు. పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పతకాలకు ఆకర్షితులై టీటీడీపీ అధ్యక్షుడు రమణ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరడం సంతోషకరమైన విషయమన్నారు. పద్మశాలీ సామాజికవర్గ అభ్యున్నతికి తన వంతు భాగస్వామ్యం అందిస్తారని ఆకాంక్షించారు. భవిష్యత్ కాలంలో తెలంగాణలో టీఆర్ఎస్ మాత్రమే నిలుస్తుందన్నారు.
విద్యార్థికి ఐవోఈఎస్ చెక్కు మంజూరు
పేద పిల్లల ఉన్నత విద్యకు ప్రోత్సాహకంగా ప్రభుత్వం మం జూరు చేసిన రూ.10లక్షల చెక్కును టీఆర్ఎస్ నాయకులు సోమవారం విద్యార్థి తండ్రికి అందజేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆర్ఎంపీ దేవులపల్లి రాజమల్లు కొడుకు సాయికుమార్ ఫ్రాన్స్లో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. 2018లో ఇండియన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరు చేసింది. సదరు చెక్కును టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ సాయికుమార్ తండ్రి రాజమల్లుకు అందజేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ, పద్మశాలీ సంఘం జిల్లా, పట్టణాధ్యక్షులు గాజుల బాలయ్య, గోలి వెంకటరమణ, మండల సత్యం పాల్గొన్నారు.