తెలంగాణ చేపలకు దేశ, విదేశాల్లో డిమాండ్
గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త
మంథని టౌన్, ఆగస్టు 4: సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని, రాష్ట్రంలో దొరికే చేపలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బెస్త తెలిపారు. మంథనిలోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయం లో బుధవారం పుట్ట మధూకర్తో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఠా గోపాల్ బెస్త మాట్లాడుతూ.. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లేదా మూడు నెలలు మాత్రమే చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవని, దీంతో అప్పుడే చేపలు పట్టే పని దొరికేదని, ఎందరో మత్స్యకారులు తమ గ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి జీవనోపాధి పొందారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవనం సాగిస్తున్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు చెరువుల్లో పూడిక తీత, డ్యామ్ల నిర్మాణంతో 365 రోజుల పాటు జలవనరుల్లో నీళ్లు ఉంటున్నాయని తెలిపారు. ఏడాది పాటు వర్షాలు పడక పోయినా నీళ్లు ఉండే లా ప్రాజెక్టులు, డ్యామ్లను కట్టించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. దీంతో మత్స్యకారులకు చేతి నిండి పని దొరుకుతున్నదని తెలిపారు. గతంలో జెల్లలు, పరికెల, ఉరిషెలులాంటి చిన్న చేపలు మాత్రమే దొరికేవని, ప్రస్తుతం 30 నుంచి 40 కిలోల బరువైన చేపలను మత్స్యకారులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 5లక్షల టన్నుల దాకా పడుతున్నారన్నారు. స్వీట్ గోల్డ్ ఫిష్గా పిలువ బడే తెలంగాణ చేపలకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని వెల్లడించారు. కరీంనగర్లో మానేరు డ్యామ్, వరంగల్ పెంబేరు వద్ద ఫిష్ ఎడ్యూకేషన్ ఏర్పాటు చేశారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తగరం శంకర్లాల్ తదితరులున్నారు.