అడుగడుగునా స్వాగత తోరణాలు
ఘనంగా స్వాగతించిన టీఆర్ఎస్ శ్రేణులు
దారిపొడవునా పూలవర్షం.. జేజేలు
సిరిసిల్ల/ సిరిసిల్ల రూరల్/సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్/ముస్తాబాద్/ ఎల్లారెడ్డిపేట/ గంభీరావుపేట, జూలై 4: ప్రగతి రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్కు కార్మికక్షేత్రం అడుగడుగునా నీరాజనం పట్టింది. హైదరాబాద్ నుంచి సిద్దిపేట-సిరిసిల్ల రోడ్డు మార్గం ద్వారా ప్రత్యేక బస్సులో వచ్చిన ఆయనకు కార్మికలోకం జేజేలు పలికింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని జిల్లా సరిహద్దు నుంచి సిరిసిల్ల వరకు దారిపొడవునా ఫ్లెక్సీలు, కటౌట్లు, గులాబీ తోరణాలతో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ముందుగా జిల్లెల్ల-జక్కాపూర్ వ్యవసాయ కళాశాల వద్ద మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు రఘోత్తంరెడ్డి, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ రవీందర్రావు ఘనస్వాగతం పలికారు.
ఉదయం 11:40 గంటలకు ముఖ్యమంత్రి జిల్లెల్లకు రాగానే ‘కేసీఆర్ జిందాబాద్’ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారిపొడవునా సీఎం వాహనంపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని టెక్స్టైల్ పార్క్ ప్రధాన గేటు ఎదుట టెక్స్టైల్ పార్క్లోని యజమానుల అసోషియేషన్ అధ్యక్షులు అన్నలదాస్ అనిల్ అధ్వర్యంలో ఘన ఆహ్వానించారు. రెండు కిలోమీటర్ల పొడవునా ముఖ్యమంత్రి కాన్వాయ్పై పూలవర్షం కురిపించారు. బద్దెనపల్లి చౌరస్తాలో కేసీఆర్ అభివాదం చేయడంతో కార్యకర్తలు, అభిమానులు తన్మయంతో నినాదాలు చేశారు. మండెపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు చేరుకోగా, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఇండ్లు నిర్మించిన నవతేజ కంపెనీ ఎండీ గండ్ర యాదగిరిరావు పుష్పగుచ్ఛాలు అందజేశారు. అక్కడి నుంచి ఐడీటీఆర్ చేరుకోగా నిర్వాహకులు ఆహ్వానించారు.
అక్కడి నుంచి సిరిసిల్లలోని నర్సింగ్ కళాశాలకు వెళ్లి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సర్దాపూర్లోని మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి వెళ్లగా, పెద్దూరు వద్ద గంభీరావుపేట మండల ప్రజాప్రతినిధులు సీఎం కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. సర్దాపూర్లో డప్పు చప్పుళ్ల మధ్య కళాకారులు నృత్యాలు చేస్తూ అలరించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని పలు గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు సీఎం కేసీఆర్కు పూలతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం 1.35 గంటలకు చేరుకోగానే ‘జై కేసీఆర్, జై కేటీఆర్’ అంటూ నినదించారు. 1.39 గంటలకు వ్యవసాయ మార్కెట్ను, 1.42 గంటలకు పరిపాలనా భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం వాహనంపై నుంచి 1.57 గంటలకు గ్యాలరీలో ఉన్న రైతులు, అభిమానులు కార్యకర్తలకు అభివాదం చేస్తూ వెళ్లారు. అనంతరం సిరిసిల్ల బైపాస్లోని నూతన కలెక్టరేట్కు వెళ్లి ప్రసంగించారు. 4గంటల తర్వాత తిరిగి హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.