పేదల ఆత్మగౌరవ ప్రతీకగా ‘కేసీఆర్ నగర్’
మంత్రి కేటీఆర్ చొరవతో ఆధునికంగా గృహాలు
80 కోట్లతో 1,320 ఇండ్ల నిర్మాణాలు
సిరిసిల్ల వాసులకు 1260, మండెపల్లి వాసులకు 60 గృహాలు
అందుబాటులో సకల సౌకర్యాలు lవిశాలమైన రహదారులు.. పార్కులు
సిరిసిల్ల రూరల్, జూలై 2:పేదల ఏళ్లనాటి సొంతింటి కలసాకారం కాబోతున్నది. మండెపల్లి శివారులో పేదల గృహ ప్రవేశాలకు ముహూర్తం ఖారారైంది. 80కోట్ల వ్యయంతో 1,320 డబుల్ బెడ్రూం ఇండ్లు ఆధునిక హంగులతో నిర్మాణం పూర్తి చేసుకొని, సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిత్య పర్యవేక్షణతో విల్లాలను తలపించేలా భవన సముదాయాలు రూపుదిద్దుకున్నాయి. విశాలమైన రోడ్లు.. బ్లాకులకు ఇరువైపులా డ్రైనేజీలు.. దారి పొడవునా పచ్చని చెట్లు.. ఆహ్లాదం పంచే పార్కులు.. ఇలా సకల వసతులతో ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
సిరిసిల్ల ప్రజల కోసం మంత్రి కేటీఆర్ అరుదైన కానుకగా డబుల్ బెడ్రూం ఇండ్లను అందించాలని సంకల్పించారు. మొదటి నుంచి కేటీఆర్ సిరిసిల్లలో ఇండ్లు లేని నిరుపేదలకు కట్టివ్వాలని పరితపించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి సిరిసిల్ల ఆదర్శంగా ఉండాలని భావించారు. మొదటి, రెండో విడుతలో కలిపి సిరిసిల్ల వాసులకు 1,260, రెండో విడుతలో మండెపల్లి వాసులకు 60 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని 30 ఎకరాల్లో 1,320 ఇండ్ల నిర్మాణాలకు 2017 మార్చి 10న భూమి పూజ చేశారు. ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధికారులు, కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. శరవేగంగా పూర్తి చేయించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు.
80 కోట్లతో పనులు..
మొదటి, రెండో విడుతలో మంజూరైన మొత్తం 1,320 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను 80కోట్లతో 30ఎకరాల స్థలంలో చేపట్టారు. వాటిలో జీ+4లో 110 బ్లాక్లుండగా, ఒక్కో బ్లాక్కు 12 ఇండ్లను నిర్మించారు. ఒక్కో ఫ్ల్లోర్లో 4 ఇండ్లు ఉండేలా నిర్మించారు. ఒక్కో ఫ్లాట్ ఏరియా 560 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో నిర్మించారు. ఫ్లాట్లో రెండు బెడ్రూంలు, హాల్, కిచెన్, కామన్బాత్రూం, అటాచ్డ్ బాత్రూం ఏర్పాటు చేశారు. మొత్తంగా ఐదు వేల జనాభా నివాసముండేలా వసతులు కల్పించారు. మరో 21 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. మండెపల్లి నుంచి 1.5 కిలోమీటర్ల పొడవు బీటీ రోడ్డు, బద్దెనపల్లి నుంచి 2.5 కిలోమీటర్ల పొడవు 100 పీట్ల వెడల్పుతో బీటీ రోడ్డు వేశారు.
సకల వసతులు..
డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం (కేసీఆర్ నగర్)లో సకల వసతులు కల్పించారు. ఇండ్ల చుట్టూ గ్రీనరీ, ప్రధాన స్వాగతతోరణం, పైలాన్తోపాటు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇండ్ల మధ్యన 30 ఫీట్లు, 40 ఫీట్ల సీసీ రోడ్లు వేయించారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటారు. చిల్ట్రన్ పార్క్, ప్లే పార్క్ను ఏర్పాటు చేశారు. మూడు వాటర్ ట్యాంక్లు నిర్మించారు. మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రత్యేక సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇండ్ల చుట్టూ భారీ ప్రహరీ నిర్మించారు. ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి కేసీఆర్నగర్గా నామకరణం చేశారు. అంతేకాదు ప్రారంభోత్సవం కోసం ప్రత్యేకంగా పైలాన్ తయారు చేశారు. కరోనా, వరుస ఎన్నికల నేపథ్యంలో పంపిణీకి ఆలస్యమైనా ఆదివారం సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు.
ఆనందంలో పేదలు..
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆదివారం డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించనుండగా, పట్టణ, గ్రామీణ పేదలు ఆనందంలో మునిగిపోయారు. ఏళ్ల నాటి తమ సొంతింటి కల సాకారం కాబోతున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక హంగులతో నిర్మించిన గృహాలు తమకు ఇస్తారని, అందుకు ఎనలేని కృషిచేసిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మండెపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలోనే ఐటీఐ కళాశాల, మోడల్ స్కూల్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఉండడం విశేషం. దీంతో ఆ ప్రాంతం అనతి కాలంలోనే అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారనుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.