రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): వర్షాలు పడితే చాలు సిరిసిల్ల పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుంటున్నాయి. నిలిచిన నీరు రెండు మూడు రోజులైనా మానేరులోకి వెళ్లడం లేదు. దీంతో ఆప్రాంత ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రాక, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటూ గడుపాల్సిన పరిస్థితి. వరద నీటిలో దిగ్బంధమైన సిరిసిల్లను మంత్రి కేటీఆర్ ఇటీవల స్వయంగా పర్యటించారు. ఆ వార్డుల్లోని ప్రజలు వారి బాధలను ఆమాత్యుడితో మొరపెట్టుకున్నారు. ‘మీరు పంపించిన పోలీస్ సహాయక బృందాలు రాకుంటే మా పరిస్థితి ఏమిటంటూ’ బోరున విలపించారు. వారి బాధలను అర్థం చేసుకున్న మంత్రి ఈ పరిస్థితికి కారణాలేమిటని అడిగి తెలుసుకున్నారు. బోనాల నుంచి కొత్తచెరువు వరకు దశాబ్దాల కింద ఉన్న వరద వెళ్లేందుకు నిర్మించిన కాలువ, నాలాలు కబ్జాకు గరయ్యాయని, వాటి అనవాళ్లు కూడా లేకుండా చేశారంటూ వివరించారు. అందుకు స్పందించిన అమాత్యుడు వెంటనే కాలువలను పునరుద్ధరించాలని, పూర్వ వైభవం తీసుకురావాలని ఆదేశించారు.
కబ్జాకు గురైన కాలువ ..
దశాబ్దాల క్రితం బోనాల చెరువు మత్తడి నీరంతా సిరిసిల్ల శివారులోని కాలువ ద్వారా కొత్త చెరువులో కలిసేది. కొత్తచెరువు నిండి మత్తడి నీరు నాలా ద్వారా శాంతినగర్ మీదుగా వెళ్లి మానేరు వాగులో కలిసేది. 40 మీటర్ల వెడల్పుతో గజం లోతులో ఉన్న కాలువల ద్వారా వరద నీరంతా ఇండ్లలోకి రాకుండా సజావుగా వెళ్లిపోయేది. ప్రస్తుతం భూముల ధరలకు రెక్కలు రావడంతో కాలువపై కబ్జాదారుల కన్ను పడింది. బోనాల నుంచి కొత్త చెరువు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరం, 40 మీటర్ల వెడల్పుతో ఉన్న కాలువ ఆరు మీటర్లకు కుదించారు. కబ్జారాయుళ్లు చేసిన అరాచకాలతో కాలువ పావుకిలోమీటరు వరకు మిగిలి మిగతాదంతా కనుమరుగైంది. కాలువపైనా, సిరిసిల్ల పట్టణంలోని నడి వీధిలో ఉన్న మరో కాలువ కూడా కబ్జాకు గురైంది. ఈ రెండింటిపై ఉన్న ఆక్రమణల ఇండ్ల చిట్టాను అధికారులు విప్పారు. కాలువల పొడవునా 1500ల ఇండ్ల వరకు ఉన్నట్లు గుర్తించి, ఎంత తొలగించాలో రెడ్ మార్కులు పెట్టారు. ఈ విషయం అమాత్యుడి దృష్టికి తీసుకొచ్చిన అధికారులకు వెంటనే కాలువ నిర్మాణం చేపట్టాలని, వదర నీటిలో సిరిసిల్ల మునిగి పోయే పరిస్థితి భవిష్యత్తులో పునరావృతం కావద్దని గట్టిగా ఆదేశించారు.
చకచకా నిర్మాణ పనులు …
వరద నీరు పట్టణంలోకి రాకుండే ఉండేందుకు వదర కాలువ నిర్మాణ పనులను యంత్రాలతో శరవేగంగా ప్రారంభించింది. ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులు రెండు జేసీబీలు పెట్టి యుద్ధప్రాతిపాదికన పనులు చేపట్టారు. ఏడు రోజులుగా పావు కిలోమీటరు దూరం వరకు కాలువ 20మీటర్ల వెడల్పుతో తవ్వుతున్నారు. బోనాల బైపాస్రోడ్డు నుంచి పద్మనగర్ కొత్తచెరువు వరకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే కోనరావుపేట మండలంలోని సుద్దాల, పల్లిమక్త, ధర్మారం, కొలనూరు, చంద్రంపేట, రగుడు చెరువుల నుంచి వచ్చిన వరద నీరు కలెక్టరేట్ను ముంచి వేస్తుంది. ఈచెరువుల నుంచి వచ్చే నీటితో కలెక్టరేట్కు ఇబ్బంది కలుగకుండా సమీకృత కలెక్టరేట్ చుట్టూ కచ్చా కాలువ నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంత వ్యయమైతే అంత ఖర్చు పెడుతున్నట్లు అధికారులు తెలిపారు.
తొందరగా పూర్తి చేస్తాం
వరద కాలువకు పూర్వవైభవం తేవాలన్న మంత్రి ఆదేశాలతో నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. కాలువల ఆక్రమణలతో చెరువులోకి వెళ్లాల్సిన వరద నీరంతా పట్టణంలోని ఇండ్లలోకి వస్తున్నది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మంత్రి మార్గదర్శకత్వం, కలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతున్నాం. కాలువ ఇరిగేషన్, మున్సిపల్ శాఖలకు సంబంధించినది కాబట్టి, రెండు శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేస్తున్నాం. తొందరగా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూస్తున్నాం.