గత పదిహేనేండ్లలో మన విదేశాంగ ఆంతరంగిక విధానాల్లో బింబప్రతిబింబ భావమెంత వరకు కనిపించింది? ప్రపంచ దేశాలన్నింటికీ శాంతిపాఠాలు చెప్పి మనం చిల్లర మల్లర ఆంతరంగిక వ్యవహారాల్లో అశాంతి మార్గాలను అవలంబించకూడదు. విశ్వమానవ సమైక్యతను, సమానత్వాన్ని ఉద్బోధించిన మనం అడుగడుగునా కుల, మత, వర్గ, వ్యక్తి ద్వేషాలకు అవకాశమివ్వకూడదు.
మన దేశం శాంతి కాముకదేశం. మన జాతి ఎన్నడూ ఒకరితో కయ్యానికి కాలు దువ్వలేదు. మరొక దేశంపైన దాడి చేయలేదు. ఒకరి భూభాగం పైన కన్ను వేయలేదు. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికీ, శాంతియుత సహజీవనానికీ మనమే బాటలు వేశాం. ఎంత విషమ సమస్యనైనా సరే, సామరస్యం ద్వారా పరిష్కరించవచ్చునని విశ్వసించాం. ఆ విశ్వాసాన్ని పురస్కరించుకొని అనేక సమస్యల పరిష్కారంలో సముచిత పాత్ర నిర్వహిస్తూ వచ్చాం. ఇదే మన సిద్ధాంతం. ఇదే మన సంప్రదాయం.
కానీ కాలం తారుమారైంది. శాంతికాముకత్వమంటే బలహీనత అనీ, సామరస్య ప్రవృత్తి అంటే చేతగానితనమనీ, సహజీవన విధానమంటే నిష్క్రియత్వమనీ- మన పొరుగుదేశమైన చైనా పాలకులు అపార్థం చేసుకున్నారు. అవసరమున్నా లేకున్నా యుద్ధానికే అలవాటుపడ్డవారైనందున శత్రుదేశమేదీ అనువుగా కనపడలేదని మిత్రదేశంపైనే బలమదాలను ప్రదర్శించబూనారు. ప్రపంచ చరిత్రలో ఇటీవల కనీవినీ ఎరుగని అమానుషత్వం, శఠత్వం, సామ్రా జ్య కాంక్ష వారివేనన్న శాశ్వత దుష్కీర్తిని సాధించుకున్నారు. అయితే చైనా సేనల ఆకస్మిక దురాక్రమణకు భారతదేశం మరింత కాకలు తీరిందే కానీ చలించలేదు, ఛిన్నాభిన్నం కాలేదు. దేశ చరిత్రలో ఎన్నడూలేని ఉత్సాహం, ఐక్యభావం, నవ చైతన్యం చైనా దండయాత్ర ఫలితంగా వెల్లివిరిశాయి. ఈ నవ చైతన్యాన్ని సంఘటితపరచడమే నేడు మన ప్రథమ కర్తవ్యం.
ఏ ఉద్యమమైనా యువజనుల ఉత్సాహంతోను, అనుభవజ్ఞుల సలహా సంప్రదింపులతోను ముందుకు సాగుతుంటుంది. కావున నేటి దురాక్రమణను ప్రతిఘటించే కార్యక్రమం కూడా ప్రజా ఉద్యమ స్వరూ పం దాల్చవలెనంటే యువకులే దానికి వెన్నెముకగా నిలువక తప్పదు. దేశ రక్షణ కార్యక్రమంలో యువకులు ఏం చేయాలో చెప్పాలంటే, ఇంతవరకు యువకులేం చేస్తూ వచ్చారో క్లుప్తంగా సమీక్షించడం అసంగతం కాదనుకుంటాను. స్వాతంత్య్రాన్ని ఒకసారి సాధించామంటే చాలు, అది ఎల్లకాలం సుస్థిరంగా తనంత తానే ఉంటుందన్న భావం మన దేశంలో కనీసం పరోక్షంగానైనా ప్రబలిందని అంగీకరించాలి. స్వాతంత్య్ర సముపార్జనం సందర్భంలో అశేష త్యాగాలు చేసి అచంచల దీక్షను ప్రదర్శించిన దేశ సేవకులెందరో రంగం నుంచి రాలిపోవడమో, తప్పుకోవడమో జరిగింది. నేటి యువకుల్లో చాలామంది స్వతం త్ర వాతావరణంలోనే జన్మించినవారు, బుద్ధి తెలిసినవారు. స్వాతంత్య్ర ఫలితాలకై పరస్పరం పోటీలు పడుతున్న సందర్భంలోనే వారి చైతన్యం ప్రారంభమైంది. వారు మల్లెపూలలా కనిపించే బియ్యాన్ని మాత్రమే చూశారు. కానీ ఎన్నిసార్లు దున్నితే, ఎన్ని నెలలు కష్టపడితే, ఎన్ని వడగండ్లను సహిస్తే, ఎన్ని కొడవళ్ళతో కోస్తే, చివరికి ఎన్ని రోకండ్లతో దంచితే ఆ బియ్యం తయారయ్యాయో తెలుసుకుంటేనే కాని వాటి విలువ తెలియదు. కావున భారత స్వాతంత్య్ర సమర చరిత్రను సమగ్రంగా తెలుసుకొని కేవలం మేధాపరంగానే కాక భావనాత్మకంగా నాటి త్యాగపూరిత వాతావరణంలో తాదాత్మ్యం పొందడం నేటి యువకుల ప్రథమ కర్తవ్యమైయున్నది.
ఒక దేశ విదేశాంగ విధానం ఆ దేశపు ఆంతరంగిక విధానాన్నే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే ఉండాలి. అలాంటప్పుడు గత పదిహేనేండ్లలో మన విదేశాంగ ఆంతరంగిక విధానాల్లో బింబప్రతిబింబ భావమెంత వరకు కనిపించింది? ప్రపంచ దేశాలన్నింటికీ శాంతిపాఠాలు చెప్పి మనం చిల్లర మల్లర ఆంతరంగిక వ్యవహారాల్లో అశాంతి మార్గాలను అవలంబించకూడదు. విశ్వమానవ సమైక్యతను, సమానత్వాన్ని ఉద్బోధించిన మనం అడుగడుగునా కుల, మత, వర్గ, వ్యక్తి ద్వేషాలకు అవకాశమివ్వకూడదు. సుపరిత్యాగానికి పెట్టింది పేరుగా నిలిచిన మనం క్షుద్ర స్వార్థ కార్యాలకు లొంగిపోరాదు. మరి ఈ కారణాల వల్లనే మన శాంతికాముకత్వాన్ని, సామరస్య ప్రవృత్తినీ, సహజీవన విధానాన్నీ పునాదిలేనివిగా అపార్థం చేసుకోవడం జరిగిందో ఏమో మనం సూక్ష్మంగా పరిశీలించి ఆత్మపరీక్ష చేసుకోవాలి.
మన జాతి శారీరకంగా పటిష్ఠం కావలసి ఉం టుంది. శరీర వ్యాయామం, క్రీడారంగం, పౌర రక్షణ కార్యక్రమం, సైనిక శిక్షణ ఇవన్నీ జాతి సన్నద్ధతలో వేర్వేరు మెట్లు. కోట్లాది యువకులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. ప్రతి యువకుడొక సైనికుడుగా తయారుకావలసి ఉంటుంది. గ్రామ గ్రామంలో క్రమశిక్షణకు సంబంధించిన అనేక కార్యక్రమాలు రూపొందించవలసి ఉంటుంది. వ్యవసాయరంగంలో, పారిశ్రామిక రంగంలో, మరే రంగంలోకాని ఇంకా అలసత్వానికి ఆస్కారం లేదు. అన్ని కార్యక్రమాలు యుద్ధ స్థాయిలోనే నడువవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో యువజనులదే ముఖ్యపాత్రగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.
ప్రస్తుత యుద్ధ విరమణ వల్ల ప్రజల ఉత్సాహం సన్నగిల్లకుండా ప్రత్యేక కృషి చేయవలసి ఉంటుంది. రక్షణ సన్నాహాలు మునుపటి వలెనే సాగించడం అవసరం. ఇది అనుకున్నంత సులభం కాదు. యుద్ధ మనస్తత్వం లేని భారత ప్రజలు యుద్ధ విరమణ జరిగిందని తమ ఉద్రేకాన్ని సడలనిచ్చే ప్రమాదం లేకపోలేదు. ప్రజల్లో త్యాగబుద్ధిని ఉత్తేజపరిచి, రక్షణ కృషిలో తాను భాగస్వామి అనే చైతన్యం ప్రతి వ్యక్తిలో ఉద్భవిస్తేనే తప్ప జాతి ఉత్సాహం నిలుపడం సాధ్యం కాదు. కావున జాతి ఉత్సాహాన్ని నిలుపుకొనే బాధ్యత కూడా సహజంగానే ఉత్సాహవంతులైన యువజనులే నిర్వహించవలసి ఉంటుంది.
దేశ రక్షణ కార్యక్రమమంటే చదువు ఇష్టం లేని విద్యార్థుల ఉబుసుపోకకు ఒక అవకాశమని మాత్రం భావించవద్దు. కాబట్టి విద్యార్థుల కార్యక్రమాలు ముఖ్యంగా మేధోరంగంలోను, శారీరక రంగంలోనూ రూపొందించడం సమంజసమవుతుంది. శ్రద్ధతో పనిచేయదలిస్తే ఇతర రంగాల జోలికి పోకుండా పై రెండు రంగాలలోనే విద్యార్థులందరికీ తలకిమించిన కార్యభారం లభ్యమవుతుంది అనడంలో సందేహం లేదు. చైనా, ఇండియా సరిహద్దు తగాదాలోని వాస్తవ అంశాలు ప్రజా సామాన్యానికి తెలియపరచడంలో విద్యార్థులు విద్యావంతులైన యువకులు ఎంతో పనిచేయవలసి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కావలసిన సాహిత్యాన్ని ప్రచురిస్తున్నాయి. ఆ సాహిత్యాన్ని చదివి, అందులోని ముఖ్యాంశాలు చర్చించడం, తత్సంబంధమైన ఇతర పరిశోధనలు జరపడం, అధ్యయన శిబిరాలు ఏర్పాటుచేయడం ఈ పనంతా విద్యార్థి, యువజన సంఘాలు చేస్తే బాగుంటుంది. ఇది వాళ్లకు సాధ్యమైనట్లు మరెవ్వరికీ కాదు.
యువజనుల తక్షణ కర్తవ్యాలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే పేర్కొనడం సాధ్యమవుతుంది. మిగతా వివరాలన్నీ వారి సమయస్ఫూర్తికి వదిలివేయడమే సమంజసమవుతుంది. మొత్తానికి నూతన చైతన్య, నూతన సన్నద్ధత ఈ రెంటిని లక్ష్యాలుగా పెట్టుకొని తమ శక్తిని అపసవ్యం కాకుండా వినియోగించడం యువజనులు నేర్చుకుంటే- వారు చేపట్టిన ఏ కార్యక్రమమైనా దేశ రక్షణకు దోహదకారిగా ఉంటుంది.
విశాల భావసరళి లోపించినప్పుడు వైషమ్యాలు పెరుగుతాయి. ప్రతికూల వైఖరి, అమిత్రభావం ఇనుమడిస్తాయి. క్రమంగా ఘర్షణలు ఏర్పడతాయి. దౌర్జన్యాలు చెలరేగుతాయి. ఈ మాదిరి పరిస్థితులు ఏ దేశానికీ వాంఛనీయం కాదు.. ఆరోగ్యం, జనాభా, ఉపాధి మొదలైన రంగాల్లో ఏర్పడుతున్న సమస్యలను సంఘీభావంతో, సమష్టి దృక్పథంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది.
– పీవీ నరసింహారావు