హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకొని హుస్సేన్సాగర్ సమీపంలో నెక్లెస్రోడ్డులో ఏర్పాటుచేసిన పీవీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ఆవిష్కరించనున్నారు. నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పీవీ మార్గ్గా మార్చిన విషయం తెలిసిందే. ఏడాదికాలంగా పీవీ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. జూన్ 28 పీవీ జయంతి. విగ్రహావిష్కరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం విగ్రహం పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ కే కేశవరావు, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్, కార్యదర్శి సంతోష్, డీసీపీ విశ్వప్రసాద్, ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. విగ్రహం చుట్టూ వివిధ రకాల అభివృద్ధి పనులు, పచ్చదనం, ఫెన్సింగ్ వంటివి ఇప్పటికే పూర్తి చేశారు. 15 రోజులుగా హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగంతోపాటు సాంస్కృతిక శాఖ ఉన్నతాధి కారులు విగ్రహం ఏర్పాటు పనులను పర్యవేక్షించారు.