పీవీ నరసింహారావు స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. ప్రొటోకాల్ పట్టించుకోకుండానే వారితో గడిపేవారు. మామూలు వ్యక్తిలాగానే అంతే చనువుగా ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. అందుకు ఇదొక ఉదాహరణ.
పీవీకి తన ఆప్తుడు, బంధువు వీఎల్ నర్సింహారావు అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆయన్ను ఎప్పుడూ బాబు అని సంబోధించేవారు. వీఎల్ నరసింహారావుకు పీవీ అంటే ఆపారమైన గౌరవం. అయితే సంప్రదాయాలకు, మర్యాదలకు ఎంతో విలువనిచ్చేవారు. ఎక్కడైనా, ఏదైనా లోపం జరిగితే మాత్రం కోపంతో ఊగిపోయేవారు. ఒకసారి ఇరువురూ కలిసి ఒక సభకు హాజరయ్యారు. నిర్వాహకులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వీఎల్ నరసింహారావు ఆలకబూనారు. సభ వేదిక మీదకు రాకుండా కిందనే ఉండిపోయారు. ఇది గమనించిన పీవీ సదరు నిర్వాహకులను పిలిచి ‘ఆ బాబును పట్టించుకోండి. మనవాడు మర్యాద తప్ప ఏదీ తీసుకోడు. పట్టించుకోడు’ అంటూ వారితో నచ్చజెప్పించి చివరకు వీఎల్ను వేదిక మీదకు రప్పించుకున్నాడు.