హైకమాండ్ (ఢిల్లీలో) తమ చేతిలో ఉన్నప్పటికీ, తాము కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకున్నప్పటికి, పెత్తనం తమదైనప్పటికి బెంగాలీయే ముఖ్యమంత్రి అవుతాడని బీజేపీ అధినేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పదేపదే పరోక్ష సంకేతాలు ఇచ్చినప్పటికి బెంగాలీలు విశ్వసించలేదు. (ముఖ్యమంత్రి పదవికి ఒక బెంగాలీని ఎంపిక చేసినప్పటికీ పెత్తనం బయటిదే ఉంటుందని బెంగాలీలు గ్రహించారు). ఆత్మాభిమానాన్ని నిర్ద్వంద్వంగా చాటిచెప్పడంలో, ప్రాం తీయ ప్రయోజనాల పరిరక్షణలో తెలంగాణ ప్రజలు బెంగాలీలను మించినవారని ప్రపంచానికి తెలుసు.
స్వరాష్ట్రం సాధించుకొని, ప్రగతిపథంలో పయనించడానికి, సంక్షేమమార్గంలో పురోగమించడానికి సకల త్యాగాలకు సిద్ధమై ఎవరు తమకు అండగా నిలిచారో, కీలక ఉద్యమంలో ఎవరు తమ గుండెల్లో గునపాలు గుచ్చారో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. అది ఏ రూపంలో ఉన్నప్పటికి, బయటి పెత్తనాన్ని, జోక్యాన్ని ఇక తెలంగాణ ప్రజలు సహించలేరు. ఢిల్లీ నుంచి యాచించి తెచ్చే మృష్టాన్న భోజనం కంటే తెలంగాణ మట్టి తలెలో తినే బువ్వ విలువైందని తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ బిడ్డలను తెలంగాణ ప్రభుత్వ నాయకులు గౌరవించినట్లు ఢిల్లీ పాలకులు ఎన్నడూ గౌరవించరని గతేడాది కాలంలో తెలంగాణ ప్రజలు పీవీ విషయంలో గ్రహించగలిగారు. పీవీ మాజీ ప్రధాని. సకల భారతాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి, సామాజిక క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కించిన మహా నాయకుడు. అయినా, ఇప్పటి భారత ప్రభుత్వం పీవీని ఇంతవరకు సముచిత రీతిలో గౌరవించలేదు.
పోతన, కాళోజీ, దాశరథి వంటి ధిక్కరణ కవులను గౌరవించిన మహా మేధావి, బహుభాషావేత్త పీవీ ధిక్కరణ కవుల్లో అగ్రగణ్యుడు మహాకవి శ్రీశ్రీ భౌతికంగా అస్తమించి ఇవాళిటికి (జూన్ 15, 1983) 38 ఏండ్లు. మన కాళోజీ ‘నా గొడవ’ ప్రథమ ప్రచురణను 1953లో సారస్వత పరిషత్తు అలంపురం సభల్లో ఆవిష్కరించింది శ్రీశ్రీ. శ్రీశ్రీ ఆత్మకథ ‘అనంతం’ రచనలో ఉడుతా భక్తిగా భాగస్వామిని అయ్యే అవకాశం లభించడం నా అదృష్టం. నాటి, మొదటి (1974) ‘ప్రజాతంత్ర’ వారపత్రిక యజమాని+సంపాదకుడు రావుగారు ఓ రోజు సాయంత్రం రామకోటిలోని తమ ఇంటికి శ్రీశ్రీని, గోపాల చక్రవర్తిని భోజనానికి ఆహ్వానించి నన్ను రమ్మన్నారు. ఆ భోజన కార్యక్రమంలో నాది అభోజనం. నేను న్యాయం చేయలేకపోయాను. శ్రీశ్రీ గూడ ఆ రోజు తిన్నది తక్కువ, సేవించింది ఎక్కువ. ఎటువంటి కట్టుబాట్లను లెక్కచేయని ‘స్వేచ్ఛాజీవి’ శ్రీశ్రీని, ఓ మహాకవిని ఆ రాత్రి నేను చూశాను. ఈ సంఘటనకు ముందు ఓ రోజు (శ్రీశ్రీని కలువడం అది మొదటిసారి) సాయంత్రం ఓయూ విద్యార్థులం కొందరం శ్రీశ్రీతో ఇష్టాగోష్ఠి జరిపాం.
తాతాజీ తాపీ ధర్మారావు ఆ ఇష్టాగోష్ఠికి అధ్యక్షత వహించారు. శ్రీశ్రీ చాలాసేపు ప్రసంగించి విద్యార్థుల ప్రశ్నలకు ఓపికతో, వివరంగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో కుందుర్తి, గోపాల చక్రవర్తి కూడా పాల్గొన్నారు. అది కేవలం తేనీటితో ముగిసిన కార్యక్రమం. ‘గురజాడ అకవి’ అన్న ప్రచారం జోరుగా జరుగుతున్న రోజుల్లో ఓయూ విద్యార్థులం తాపీ ధర్మారావు మార్గదర్శకత్వంలో అభ్యుదయ కళాసమితి ఆధ్వర్యాన హైదరాబాద్ నగరంలో ‘గురజాడ జయంతి’ సభలు మూడురోజులు నిర్వహించాం, ఈ సభల్లో (ఆరుద్ర, దాశరథితో పాటు) పాల్గొనిన శ్రీశ్రీ ఏ హోటల్కు వెళ్లకుండా జాగరూకత వహించాలని ప్రత్యేకంగా ఒక ఇంటిలో ఆయన విడిది ఏర్పాటుచేయాలని తాపీ ధర్మారావు విద్యార్థులను హెచ్చరించారు.
మహాకవి శ్రీశ్రీని గృహ నిర్బంధంలో పెట్టడం విద్యార్థులకు కష్టమైంది. ఇంత పెద్ద సాహిత్య సభల్లో తాను ఇంతవరకు, ఎన్నడు ఎక్కడ పాల్గొనలేదని శ్రీశ్రీ ఆవేశంతో అన్నారు. సోవియట్ యూనియన్ (అప్పటి) సాంస్కృతిక ప్రతినిధి వర్గం ఈ సభలకు రావడం, ఫొటోలను, డాక్యుమెంటరీని తీయడం విశేషం. విద్యార్థులం కొందరం ఆ రోజుల్లో ఉస్మాని యా విశ్వవిద్యాలయం క్యాంపస్ హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులకు మహాకవి గురజాడ, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి, ప్రజాకవి కాళోజీ, మహాకవి దాశరథి, కొడవటికంటి కుటుంబరావు తదితరుల రచనల గురించి వివరించి చెప్పేవాళ్లం ప్రత్యేకంగా కోరిన విద్యార్థులకు ఈ కవులు, రచయితల గ్రంథాలను ఇచ్చేవాళ్లం.
-దేవులపల్లి ప్రభాకరరావు