-రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్
కమాన్పూర్ : పంట మార్పిడితో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ఆ దిశగా దృష్టి సారించాలని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం (కే.వీ.కే) శాస్త్రవేత్త శ్రీనివాస్ అన్నారు. మండలంలోని గుండారం గ్రామంలోని రైతువేదికలో శనివారం గుండారం, కమాన్పూర్, జూలపల్లి, పేరపల్లి, గొల్లపల్లి గ్రామాల రైతులకు పంట మార్పిడిపై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు వేసిన పంటలనే మళ్లీ, మళ్లీ వేయడంతో లాభాలకంటే నష్టాలే వస్తాయన్నారు. ఒకే రకమైన పంటను అధిక మంది రైతులు సాగు చేయడంతో డిమాండ్ తగ్గి రైతులు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర లభించదన్నారు. అదేవిధంగా పంట మార్పిడితో చీడపీడలు దూరమవుతాయని, మందుల ఖర్చు తగ్గుతుందని, పంటలో నాణ్యత పెరిగి దిగుబడి పెరుగుతుందన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను సాగు చేయడం వల్ల రైతులు అధిక ప్రయోజనాలను పొందొచ్చన్నారు.
ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు దృష్టి సారించాలన్నారు. ఈ సదస్సులో మండల వ్యవసాయాధికారి బండి ప్రమోద్కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పొనగంటి కనకయ్య, గుండారం గ్రామ సర్పంచ్ ఆకుల ఓదెలు, ఏఈవోలు శ్రీనివాస్, సురేశ్నాయక్, రైతు బందు సమితి గ్రామ కో-ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.