పెద్దపల్లి : తొమ్మిది నెలలు మోసి అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకులే కాదు పొమ్మన్నారు. ముసలితనంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిని నడిరోడ్డుపై నిలబెట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని లక్కారం గ్రామంలో చోటుచేసుకుంది. మానవత్వం మంటగలిసిన చోట మేమున్నామంటూ పోలీసులు వచ్చి వృద్ధురాలికి అండగా నిలిచారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నరసింహారావు, మంథని సీఐ మహేందర్ రెడ్డి లక్కారం గ్రామానికి చేరుకొని అవ్వకు అండగా నిలిచారు.
రాజమ్మకు నలుగురు కుమారులు. రెండో కొడుకు బాపు, చిన్న కొడుకు సారయ్య మృతి చెందారు. పెద్ద కొడుకు రాజయ్య సింగరేణి రిటైర్ కార్మికుడు. బేగంపేట ఎక్స్ రోడ్ వద్ద నివాసముంటున్నారు. మూడో కుమారుడు శంకర్ కోరుట్లలో నివాసముంటున్నాడు. కొన్ని రోజులుగా వృద్ధురాలిని మీరంటే మీరే చూసుకోవాలి అంటూ కొడుకులు, కోడళ్లు గొడవలు పెట్టుకుని వృద్ధురాలిని ఇంట్లోంచి గెంటేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొడుకులను, కొడళ్లను బుధవారం కౌన్సిలింగ్ నిమిత్తం స్టేషన్కు రావాల్సిందిగా చెప్పి వృద్ధురాలిని రెండో కొడుకు భార్య వనిత వద్ద ఉంచి వెళ్లారు. వారి వెంట జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ వరప్రసాద్ కూడా ఉన్నారు.