పెద్దపల్లి జంక్షన్ : అక్టోబర్ నెలాఖరు వరకు పెండింగ్లో ఉన్న ఎస్సీ సబ్సిడీ యూనిట్లను పంపిణీ చేయాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతాసత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల రుణాలు, ఆర్థిక అక్షరాస్యత, అయిల్పామ్ సాగు రుణాలు, తదితర అంశాలపై డీసీసీ డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ జూమ్ యాప్ ద్వారా మంగళవారం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటికి సంబంధించిన పురోగతి, తదితర అంశాలపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి 2021 -22 ఏడాదిలో రూ. 667 కోట్ల రుణం మంజూరు చేయటం లక్ష్యం కాగా జూన్ నెల చివరి వరకు రూ. 107. 71 కోట్ల రుణాలు రైతులకు అందించామని అధికా రులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహకారాన్ని బ్యాంకర్లు అందించాలని, రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశంపై వారికి అవగాహన కల్పించాలన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం అందించే స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 3421 స్వశక్తి సంఘాలకు రూ.163.75 కోట్లు, మెప్మా కింద 165 స్వశక్తి సంఘాలకు రూ. 10.41 కోట్ల రుణాలు అందించామని అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9310 సంఘాలకు దాదాపు రూ.338 కోట్ల రుణం అందించేలా లక్ష్యంగా ఉందని, ప్రణాళికాబద్ధంగా ప్రతి మాసం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 2017-18 ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి 615 యూనిట్ల సబ్సిడీ విడుదలైనప్పటికీ 539 యూనిట్లు మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన యూనిట్లను అక్టోబర్ నెలఖారు వరకు గ్రౌండ్ అయ్యేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 92 ప్రాజెక్టులు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 17 ప్రాజెక్టులు మంజూరు చేశారని, పెండింగ్లో ఉన్న యూనిట్లను పరిశీలించి త్వరగా మంజూరు చేయాలన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద జిల్లాలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు సహకారం అందించాలన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారులకు రుణం మంజూరు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్దీపక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్, డీఆర్డీవో శ్రీధర్, ఆర్బీ ఏజీఎం అనిల్కుమార్, నాబార్డు డీడీఎం వివిధ బ్యాంకుల ఆర్ఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.