పెద్దపల్లి/ధర్మారం/రామడుగు, జూలై 3(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో లింక్-1,2లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ పంప్హౌస్లోని 8 పంపుల ద్వారా శనివారం 16,800 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్కు తరలిస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని సరస్వతీ పంప్హౌస్లో 6 మోటర్ల ద్వారా 17,580 క్యూసెక్కుల నీటిని పార్వతీ బరాజ్కు.. పార్వతీ పంప్హౌస్లో ఏడు మోటర్ల ద్వారా 18,270 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక లింక్-2లో నంది పంప్హౌస్లోని 5మోటర్ల ద్వారా 15750 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్హౌస్కు తరలిస్తున్నారు.
అక్కడి నుంచి 5 బాహుబలి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తుండగా, శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఐదో యూనిట్లో పంపును ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి గ్రావిటీ కాలువ ద్వారా వెళ్తున్న నీరు వరదకాలువలో శ్రీరాములపల్లి జంక్షన్పాయింట్ వద్ద ఓ వైపు ఎస్సారార్ జలాశయం, మరోవైపు రివర్స్ పంపింగ్కోసం మల్యాలవైపు తరలివెళ్తున్నది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌస్ నుంచి ఈ సీజన్లో ఇప్పటివరకు 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. అనుక్షణం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. కాగా, కాళేశ్వర జలాలు తరలివచ్చి రిజర్వాయర్లు నిండుకుండల్లా మారుతుండడంతో అన్నదాతలు సంబురాల్లో మునిగితేలుతున్నారు.